Ghulam Nabi Azad:  ప్రస్తుతం దేశంలో రాజకీయాలు అసహ్యంగా తయారయ్యాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సమాజంలో  మార్పు తీసుకురావడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయ‌నీ, ఆ బాధ్య‌త‌ను సామాజిక సంస్థలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో  రాజకీయాలకు రిటైర్మెంట్‌ ప్రకటించి సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.  

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ రాజకీయాలకు వీడ‌నున్నారా ?  లేదా కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పనున్నారా ? అంటే.. ఇటీవ‌ల ఆయ‌న చేసిన  వ్యాఖ్య‌లు ప‌రిశీలిస్తే.. అవుననే సమాధానం వ‌స్తుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ అధిష్ఠానంపై అసంతృప్తి  వ్య‌క్తం చేస్తున్న నేత‌ల‌ల్లో ఆజాద్ ఒక్క‌రూ కావ‌డంతో తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చనీయంగా మారాయి. ఆజాద్‌కు పద్మభూషణ్‌ లభించిన నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన స్వ‌చ్చంధ‌ సంస్థ ఆయనను సత్కరించింది. 

ఈ సందర్భంగా ఆజాద్‌ మాట్లాడుతూ.. సమాజంలో  మార్పు తీసుకురావడంలో రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడు సామాజిక సంస్థలు ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. ఇందుకోసం తాను రాజకీయాల నుంచి త‌ప్పుకొని సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు అసహ్యంగా తయారయ్యాయని పేర్కొన్నారు. పౌర స‌మాజంలో చాలా  మార్పు తీసుకురావాలి.  రాజ‌కీయ పార్టీలు .. కులం, మతం ఇతర అంశాల పేరుతో ప్రజల్లో విభజిస్తున్నార‌నీ,  ఇందుకు మా సొంత పార్టీ కాంగ్రెస్‌ కూడా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోందని,  మినహాయింపేమీ కాదనీ అన్నారు.

దేశంలో రాజకీయాలు చాలా నీచంగా మారాయని అన్నారు. ఎంత‌లా అంటే.. మనం మనుషులమేనా అన్న అనుమానం కూడా వ‌స్తుంది. ఇప్ప‌టికే పౌరసమాజం అంతా ఐకమత్యంగా ఉండాలని ఆజాద్‌ పేర్కొన్నారు. సమాజంలో జరిగే చాలా దుర్మార్గాలకు రాజకీయ పార్టీలే కారణమని, మార్పు తీసుకురాగల సామర్థ్యంపై తనకు సందేహాలు ఉన్నాయని ఆజాద్ అన్నారు. దళితులు ,అగ్రవర్ణాలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు మరియు సిక్కులను కూడా విభజించామని.. రాజకీయ పార్టీలు, మతం, రాజకీయాల పేరుతో ప్రజలను విభజిస్తుంటాయని, అయితే కష్ట సమయాల్లో ప్రజలను మార్గనిర్దేశం చేయడంలో పౌర సమాజం పాత్ర అని ఆయన అన్నారు.

ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పటి నుంచి తాను అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశానని, అనేక మంది ప్రధానుల హయాంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశానని చాలా మందికి తెలుసునని గుర్తు చేశారు. అయితే, ఆయన ప్రజా జీవితం కాంగ్రెస్ వాదిగా కాకుండా గాంధీ తత్వాన్ని అనుసరించే వ్యక్తిగా ప్రారంభమైందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసున‌ని.  మనమందరం మొదట మనుషులం, తరువాత హిందువులు మరియు ముస్లింలమ‌ని అన్నారాయన.

“ నేటికీ గాంధీ గొప్ప హిందువు, లౌకికవాదానికి అతిపెద్ద అనుచరుడు అని భావిస్తున్నాను. దేవుళ్లను పూజించే ఏ హిందువు అయినా సెక్యులర్ కాలేడని అనుకోవడం తప్పు. నిజంగా మతాన్ని అనుసరించే ఎవరైనా నిజంగా సెక్యులర్. తమ మతం గురించి తక్కువ జ్ఞానం లేని వారు ప్రమాదకరం, ”అని అతను చెప్పాడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రస్తావిస్తూ.. రోజురోజుకు మన ఆలోచనలు, మన మనస్సులు చాలా కలుషితమయ్యాయి,  ఇత‌రుల‌ను మనుషులుగా పరిగణించడం లేదని అతను చెప్పాడు. 

జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదం జీవితాలను నాశనం చేసిందని, అందులో పాకిస్థాన్ పెద్ద పాత్ర పోషిస్తోందని ఆజాద్ అన్నారు. మిలిటెంట్లు భద్రతా సిబ్బందిని, పోలీసులను హతమార్చింద‌నీ, ప్ర‌తి విషయానికి మతపరమైన రంగు పూయడం సరికాదని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో.. రాజకీయాలకు గుడ్ బై చెప్పి..  సామాజిక సేవలో పాల్గొనాలనే కుతూహలంతో ఉన్నానని చెప్పారు. అందుకే ఏక్షణమైనా వచ్చి తాను రాజకీయాలను వీడుతున్నానని ప్రకటించినా ఆశ్చర్యం లేదంటూ వేదికపై ఉన్నవారికి ముందస్తు సూచన చేశారు.