తొలిసారి ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని సునాక్ ల సమావేశం.. జీ 20 సమ్మిట్ లో పలు ఆసక్తికర సంఘటనలు
జీ 20 శిఖరాగ్ర సదస్సు తొలి రోజున భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని సునక్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. జీ20 సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చిన బాలి నుసు దువా కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో మోదీని మర్యాదపూరకంగా కలిశారు రిషి సునాక్. ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సుకు భారత్, బ్రిటన్ ప్రధానులు హాజరయ్యారు.
ఇండోనేషియాలో ప్రారంభమైన G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం బాలి చేరుకున్నారు. ఈ సదస్సుకు పలు దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సమయంలో ప్రధాని మోడీ 20 కి పైగా సమావేశాలలో పాల్గొంటారు, ఇందులో ఆహారం, భద్రత, ఇంధనం, ఉక్రెయిన్ సంక్షోభం వంటి అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు.
తొలిసారి మోడీ, సునాక్ ల సమావేశం
జీ20 శిఖరాగ్ర సదస్సు మొదటి రోజు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సమ్మిట్ తొలి సెషన్ ముగిసిన అనంతరం భారత సంతతికి చెందిన బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునక్, ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి పలకరించుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎదురుపడ్డ ఇద్దరు నేతలు కాసేపు మాట్లాడుకున్నారు. ఈ మేరకు భారత ప్రధాని కార్యాలయం మంగళవారం వెల్లడించింది. వీరిద్ధరి సమావేశం ఫొటోను ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి పలు అంశాలను ప్రస్తావించగా.. వాటిని ప్రధాని మోదీ శ్రద్ధగా, ఆసక్తిగా వినడం చూడవచ్చు. ఒకట్రెండు సందర్భాల్లో ప్రధాని మోడీ రిషి సునక్ భుజం తట్టి, ప్రశంసించడం వంటి ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి.బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రధాని మోదీ కలుసుకోవడం ఇదే తొలిసారి.
మరోవైపు రిషి సునక్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోడీతో పాటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని కిషిదాలతో బ్రిటన్ ప్రధాని కరచాలనం చేస్తున్న ఫోటో ఒకటి ట్వీట్ చేయబడింది. అలాగే.. ట్రూడో,కిషిదాలను కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.'ప్రపంచ ఆర్థిక సమస్యను ఎదుర్కొనేందుకు రానున్న రోజుల్లో మరికొంత మంది ప్రపంచ నేతలతో సమావేశాలు జరగనున్నాయి' అని పేర్కొనబడింది.
17వ G20 సమ్మిట్ బాలిలో
17వ జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇండోనేషియా రాజధాని బాలి చేరుకున్నారు. బాలిలోని కెంపిన్స్కీ హోటల్లో సమ్మిట్ జరిగింది. G20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమ్. G20 యొక్క ప్రస్తుత ఛైర్మన్ ఇండోనేషియా. ఈ శక్తివంతమైన గ్రూప్కు డిసెంబర్ 1న భారతదేశం చైర్మన్గా బాధ్యతలు చేపట్టనుంది.
ప్రధాని మోడీని ఆత్మీయంగా పలికరించిన జో బిడెన్,
బాలిలో జి20 సదస్సు ప్రారంభమైంది. అక్కడికి చేరుకున్న వివిధ దేశాల అధినేతల పరస్పర పలుకరించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్లు సమావేశమయ్యారు. ఈ ఇద్దరు అగ్రనేతల చిత్రాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది, అందులో బిడెన్, మోడీ ఉత్సాహంతో కరచాలనం చేస్తున్నారు.
అనంతరం.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి బాలి చేరుకున్న ప్రధాని మోదీకి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దీని తర్వాత, శిఖరాగ్ర సమావేశానికి హోటల్కు చేరుకున్న ప్రధాని మోదీని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో స్వాగతం పలికారు. ఆయన వచ్చిన కొద్దిసేపటికే ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ‘బాలీలోని భారతీయ సమాజానికి అందించిన సాదర స్వాగతంకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.