రైలులో మాజీ ఎమ్మెల్యే దారుణ హత్య
మాజీ ఎమ్మెల్యే రైలులో దారుణ హత్యకు గురైన సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
మాజీ ఎమ్మెల్యే రైలులో దారుణ హత్యకు గురైన సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. గుజరాత్కు చెందిన మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్ భానుషలీ ని గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఆయన భుజ్ నుంచి అహ్మదాబాద్ వెళ్లే సజయీ నగరీ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
గుజరాత్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, అబుదాస నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన జయంతీలాల్ భానుషలీపై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. గతంలో జయంతీలాల్ తనపై అకృత్యానికి పాల్పడ్డారంటూ సూరత్కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే డబ్బు కోసమే తన భార్య ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిందంటూ ఆమె భర్త పేర్కొనడంతో ఈ కేసుపై అనుమానాలు నెలకొన్నాయి.
కాగా వ్యక్తిగత పగతోనే దుండగులు జయంతీలాల్ను హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించిందని, ఈ నేపథ్యంలో జయంతీలాల్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.