ఇంటర్వ్యూకి వెళ్తుండగా ప్రమాదం.. ఐదుగురు యువకులు మృతి
ఇంటర్వ్యూ కోసమని స్నేహితులతో కలిసి బయలుదేరి వెళ్లారు. కానీ.. లారీ రూపంలో వారిని మృత్యువు కబళించింది.
వారంతా ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉద్యోగం సాధించి.. తమను కన్న తల్లిదండ్రులను కలలు తీర్చుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే.. ఉద్యోగం కోసం.. ఇంటర్వ్యూ కోసమని స్నేహితులతో కలిసి బయలుదేరి వెళ్లారు. కానీ.. లారీ రూపంలో వారిని మృత్యువు కబళించింది. ఈ ప్రమాదం చెన్నైలోని వండలూర్ సమీపంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాహుల్ కార్తికేయన్( పుదుక్కోట), రాజ హరీష్( మేట్టూర్), అరవింద్ శంకర్( చెన్నై కేకే నగర్), అజయ్( తిరుచ్చి), నవీన్( మేట్టూర్) స్నేహితులు. వీరంతా 25-30ఏళ్ల మధ్య వయసు వారే. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. సోమవారం ఓ ప్రముఖ కంపెనీలో ఇంటర్వ్యూ ఉండటంతో అందరూ కారులో శనివారం బయలుదేరి వెళ్లారు.
కాగా.. వీరు ప్రయాణిస్తున్న కారు శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత చెంగల్పట్టు జిల్లా పెరుంగళత్తూర్ సమీపంలో ఆగి ఉన్న ఇనుప కడ్డీల లోడు లారీ డీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కారులో చిక్కుకున్న యువకుల మృతదేహాలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.