భారత దేశానికి గర్వకారణమైన ఐదుగురు శాస్త్రవేత్తలు ఎవరంటే?
భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మన దేశానికి గర్వకారణంగా నిలిచిన ఐదుగురు సైంటిస్టుల గురించి చూద్దాం. సీవీ రామన్, హోమి జెహంగిర్ బాబా, విక్రమ్ సారాబాయి, ఏపీజే అబ్దుల్ కలాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్యల కృషిని చూద్దాం.
న్యూఢిల్లీ: మన నిత్యజీవితంలో సైన్స్ ప్రాధాన్యత ఇప్పుడిప్పుడే అందరికీ తెలియవస్తున్నది. పెద్దగా మనం పట్టించుకోని బల్బ్ నుంచి అంతరిక్షంలోని శాటిలైట్ వరకు.. నేటి జీవిత విధానంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. అవి లేకుండా ఇప్పటి ఆధునిక జీవితాలను ఊహించుకోలేం. ఇలా శాస్త్రరంగంలో భారత దేశానికి గర్వకారణంగా ఉన్న ఐదుగురు శాస్త్రవేత్తలను ఓ సారి చూద్దాం. వారి ఆలోచనలు, కృషి ఆయా రంగాల స్వరూపాలనే మార్చేశాయి.
సర్ సీవీ రామన్:
తిరుచిరాపల్లిలో 1888 నవంబర్ 7వ తేదీన జన్మించిన చంద్రశేఖర వెంకట రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు. ద్రవాలపై పడే కాంతి కిరణాలు పరిక్షేపం చెందే విధానం గురించి ఆయన పరిశోధనలు చేశారు. దానినే రామన్ ఎఫెక్ట్ అంటారు. ఆసియా ఖండంలోనే సైన్స్ విభాగంలో తొలి నోబెల్ బహుమతి రామన్ పొందారు.
హోమి జెహంగిర్ బాబా:
1909 అక్టోబర్ 30 తేదీన బాంబేలో జన్మించిన హోమి జెహంగిర్ బాబా క్వాంటమ్ థియరీ అభివృద్ధిలో కీలక పాత్ర వహించారు. భారత న్యూక్లియర్ పవర్కు ఈయనను వ్యవస్థాపకుడిగా పేర్కొంటారు. భారత దేశంలో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ప్రారంభించడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. అందుకు బదులు అటామిక్ రియాక్టర్ తయారు చేస్తే దేశంలో పేదరికాన్ని తగ్గించవచ్చని భావించేవారు. ఆయన 1966 జనవరి 24న ఓ విమాన ప్రమాదంలో మరణించారు. భారత న్యూక్లియర్ ప్రోగ్రామ్ను అటకెక్కించాలని సీఐఏ ఆయనను హత్య చేసినట్టూ కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
విక్రమ్ సారాబాయి:
భారత అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించినవారిగా విక్రమ్ సారాబాయికి పేరుంది. గుజరాత్లో 1919 ఆగస్టు 12న జన్మించిన ఆయన ఇస్రోను వ్యవస్థాపించడంలో కీలకంగా వ్యవహరించారు. రష్యా స్పుత్నిక్ ప్రయోగించిన తరుణంలో అభివృద్ధి చెందే దేశాల సరసన నిలవడానికి స్పేస్ డెవలప్మెంట్ చాలా అవసరం అని ఆయన ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు.
ఏపీజే అబ్దుల్ కలాం:
ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజినీర్గా ఏపీజే అబ్దుల్ కలాం విశేష సేవలు అందించారు. డీఆర్డీవోలో ఆయన కృషిని ఇప్పటికీ మాట్లాడుకుంటారు. విక్రమ్ సారాబాయ్తో పా INCOSPAR కమిటీలో కలాం ప్రముఖ అంతరిక్ష శాస్త్రజ్ఞుడిగా ఉన్నారు. తొలి దేశీయంగా రూపొందించిన శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎల్వీ-III) ప్రాజెక్టు డైరెక్టర్గా వ్యవహరించారు. 1931 అక్టోబర్ 15న జన్మించిన కలాంం 2002 నుంచి 2017 వరకు భారత దేశ రాష్ట్రపతిగా ఉన్నారు.
విశ్వేశ్వరయ్య:
1860లో జన్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాజకీయ నేత, ఎడ్యుకేటర్, సివిల్ ఇంజినీర్ కూడా. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడాలని, ఇండస్ట్రీ రంగంలో పాటుపడ్డారు. ముఖ్యంగా డ్యామ్ల నిర్మాణంలో ఆయన కృషి విశేషమైనది. ఆయన జన్మదినం సెప్టెంబర్ 15ను పురస్కరించుకుని భారత్ ఇంజినీర్స్ డే నిర్వహించుకుంటుంది.