గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా పై ఎఫ్ఐఆర్ నమోదు.. ఎందుకంటే?
గుజరాత్: సూరత్ లో జరిగిన ర్యాలీలో ఆప్ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా.. బీజేపీ నాయకులు సీఆర్ పాటిల్, హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవిపై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
అహ్మదాబాద్: ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి రాజకీయాలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా, ఢిల్లీ తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న ఆప్ సైతం ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. సూరత్ లో జరిగిన ఒక ర్యాలీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు సీఆర్ పాటిల్, హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ గుజరాత్ పోలీసులు రాష్ట్ర ఆమ్ ఆద్మీ చీఫ్ గోపాల్ ఇటాలియా పై ఎఫ్ఐరా్ నమోదుచేశారు.
సూరత్కు చెందిన వ్యాపారవేత్త ప్రతాప్భాయ్ చోడ్వాడియా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఫిర్యాదు నమోదైన ఉమ్రా పోలీస్ స్టేషన్లోని అధికారి తెలిపారు. ఆగస్టు 30న సూరత్ నగరంలో గుజరాత్ ఆప్ నాయకుడు మనోజ్ సోరథియాపై దాదాపు 10 మంది వ్యక్తుల బృందం దాడి చేసిన తర్వాత ఇటాలియా ర్యాలీ నిర్వహించిందని ఆప్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రసంగాల సమయంలోనే ఇటాలియా బీజేపీ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సోరథియాపై దాడికి అధికార బీజేపీయే కారణమని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఆరోపించింది. ఎన్నికలకు ముందు ప్రజల సానుభూతి పొందేందుకు జరిగిన ఓ డ్రామా అని ఆప్ చేసిన దాడిని బీజేపీ కొట్టిపారేసింది. గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి రుత్విజ్ పటేల్ మాట్లాడుతూ దాడి తర్వాత ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొన్న వ్యక్తులు వాస్తవానికి తమ కార్యాలయం వెలుపల ఆప్ చేసిన హింసకు బాధితులేనని అన్నారు.
“బీజేపీ కార్యకర్తలు దూరంగా నిలబడి ఉండగా, ఆప్ కార్యకర్తలు అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో వారి వద్దకు చేరుకుని మా వ్యక్తులపై దాడి చేశారు. దీంతో బీజేపీకి చెందిన దినేష్ దేశాయ్, కిషన్ దేశాయ్, కర్సన్ సాగతియా తీవ్రంగా గాయపడ్డారు. వారు ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు” అని పటేల్ చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్ శనివారం రాజ్కోట్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొని, రాజ్కోట్ స్థానిక ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ పలు హామీలను ప్రకటించారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. “మీరు ఓడిపోయినప్పుడు మీరు చేసే దాడి ఇది. బీజేపీ తన ఓటమిని పసిగట్టింది. ఇప్పటి వరకు వారు కాంగ్రెస్తో వ్యవహరిస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను, కానీ మేము కాంగ్రెస్ కాదు. మేము సర్దార్ పటేల్, భగత్ సింగ్లను నమ్ముతాము. మేం భయపడం, పోరాడతాం' అని సోరథియాపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ కేజ్రీవాల్ శనివారం అన్నారు.
సూరత్లో తమ పార్టీ సర్వే చేసిందని, 12 సీట్లకు గాను ఆప్ ఏడు స్థానాల్లో విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పంచాయతీకి అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా ₹10 లక్షల నిధులు అందజేస్తామని కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. గుజరాత్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సర్పంచ్కు నెలకు ₹10,000 జీతం ఇస్తామని కూడా చెప్పారు. “ఈరోజు గుజరాత్ మొత్తం మార్పును కోరుతోంది. మేము ఢిల్లీ ఎన్నికలలో గెలిచాము. మొదటి సారి 28 సీట్లు వచ్చాయి, ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. తర్వాత మాకు 63 సీట్లు ఇచ్చారు. ఈరోజు ఎన్నికలు జరిగినా ఢిల్లీలో 65కి పైగా సీట్లు వస్తాయంటే ప్రజలు మా పట్ల సంతోషంగా ఉన్నారు. గుజరాత్ను 27 ఏళ్లుగా బీజేపీ పాలించగా, ఇప్పుడు బీజేపీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ఢిల్లీలో మంచి పని జరిగింది, పంజాబ్లో కూడా మంచి పని మొదలైంది అని గుజరాత్ ప్రజలు చూస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ప్రజలు గుజరాత్లో కూడా మార్పు కోసం అడుగుతున్నారు' అని కేజ్రీవాల్ అన్నారు.