కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. వేరే కులానికి చెందిన కుర్రాడిని ప్రేమిస్తోందని .. ఓ వ్యక్తి కన్న కూతురిని దారుణంగా చంపాడు.

ఇతర కులస్తుడిని, మతస్తుడిని ప్రేమించిన పాపానికి నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు కొందరు వ్యక్తులు . ఇటీవల హైదరాబాద్‌ సరూర్ నగర్, బేగంబజార్‌లలో జరిగిన పరువు హత్యలు (honour killing) ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఏ భాష అయినా, రాష్ట్రమైనా పరువు హత్యలు ఆగటం లేదు. తాజాగా కర్ణాటకలోని (karnataka) మైసూరు జిల్లా (mysore district) పరిధిలోని పెరియపట్నం తాలూకా కగ్గుండి గ్రామానికి చెందిన సురేష్, బేబీ దంపతుల కుమార్తె షాలిని (17) పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. షాలిని పొరుగున ఉండే మేళ్లహళ్లి గ్రామానికి చెందిన మంజు అనే దళిత యువకుడితో ప్రేమలో పడింది.

ఈ విషయం ఆమె ఇంట్లో వాళ్లకు తెలియటంతో వారు కుమార్తెను కట్టడి చేశారు. దీంతో ఒకరోజు మంజు, షాలిని ఇంట్లోంచి పారిపోయారు. షాలిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమికులిద్దరినీ గాలించి పట్టుకున్నారు. అయితే పోలీసు స్టేషన్‌లో కూడా షాలిని తన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా… తాను మంజు మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని తాను అతనితోనే ఉంటానని తేల్చి చెప్పింది.

అయితే మైనర్ బాలిక కావటంతో పోలీసులు బాలికను బాలసదన్‌‌కు అప్పగించారు. ఈ క్రమంలో బాలసదన్‌లో ఉన్న షాలిని ఓ రోజున తన తల్లి దండ్రులకు ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకువెళ్ళమని కోరింది. దీంతో సురేష్ దంపతులు బాలసదన్‌కు వచ్చి తమ కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి వచ్చిన కొద్దిరోజులకు షాలిని మళ్లీ తాను మంజును ప్రేమిస్తున్నానని.. అతనితో ఇచ్చి తన వివాహం జరిపించమని మళ్లీ తల్లిదండ్రులను కోరింది.

దీంతో ఆగ్రహానికి గురైన సురేష్ సోమవారం తెల్లవారుఝూమున కూతురు షాలిని గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. మంజు నివసిస్తున్న మేళహళ్లి గ్రామంలోని వ్యవసాయ భూమిలో పడేసి వచ్చాడు. అనంతరం మంగళవారం ఉదయం పెరియపట్నం పోలీసు స్టేషన్ కు వెళ్లి తన కుమార్తెను హత్య చేసినట్లు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేళహళ్లి గ్రామానికి వెళ్లి షాలిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.