ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు: నేడు కేంద్రం మరోసారి చర్చలు
నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు గురువారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకొన్నాయి. రైతుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరోసారి చర్చించనుంది.
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు గురువారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకొన్నాయి. రైతుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరోసారి చర్చించనుంది.
గురువారంనాడు మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించనున్నారు.రెండు రోజుల క్రితం రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నరేంద్రసింగ్ తోమర్ లు సమావేశమయ్యారు. ఈ చర్చలు విఫలమయ్యాయి.చర్చలు విఫలం కావడంతో రైతులుు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.
also read:ఢిల్లీలో రైతుల ఆందోళనలు: ట్రాఫిక్ మళ్లింపు
రైతుల డిమాండ్లను పరిశీలించేందుకు కమిటీ వేస్తామని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించలేదు.
ఇవాళ ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి.ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సింఘి, టిక్రి సరిహద్దుల వద్ద వేలాది మంది రైతులు రోడ్లపై బైఠాయించి నిరసనకు దిగారు.
నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి.
కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల సంక్షేమం కోసమే తీసుకొచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. సుదీర్థ నిరీక్షణ తర్వాత ఈ సంస్కరణలు తీసుకొచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ను కేంద్రం తోసిపుచ్చింది. ఇవాళ చర్చలపైనే అందరి దృష్టి నెలకొంది.