నూతన సాగు చట్టాలపై రైతుల నిరసన: జంతర్ మంతర్ వద్ద ఆందోళన
కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆ:దోళనకు దిగారు.జనవరి 26వ తేదీ తర్వాత రైతుల ఆందోళనకు తొలిసారిగా ఢిల్లీ పోలీసులు అనుమతిచ్చారు.
న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలను నిరసిస్తూ రైతులు గురువారం నాడు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య 200 మంది రైతులు జంతర్ మంతర్ ఆందోళనకు శ్రీకారం చుట్టారు.పార్లమెంట్ పరిసర ప్రాంతాలతో పాటు సెంట్రల్ ఢిల్లీలో సెక్యూరిటీని పటిష్టం చేశారు. ఈ రోజు నుండి ఆగష్టు 9వ తేదీ వరకు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు రైతులకు ఢిల్లీ పోలీసులు అనుమతించారు.
కరోనా నిబంధనలను పాటిస్తామని నిరసనను శాంతియుతంగా కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు పోలీసులకు హామీ ఇచ్చారని సమాచారం. ఈ హామీ మేరకు పోలీసులు రైతుల సంఘాల ఆందోళనకు అనుమతిచ్చారు.ఈ ఏడాది జనవరి 26వ తేదీన చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనల తర్వాత రైతుల ఆందోళనకు పోలీసులు అనుమతివ్వడం ఇదే ప్రథమం.కొత్త వ్యవసాయచట్టాలను రైతుల కోసమే తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. దీని వల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కానీ కేంద్ర ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదని రైతులు చెబుతున్నారు. ఈ చట్టాలతో లాభం కంటే నష్టమే కలుగుతుందని రైతులు చెప్పారు.