మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మైతేయి కమ్యూనిటీకి చెందిన ఆ మూక వెర్రెత్తిపోవడానికి ఓ ఫేక్ వీడియో కారణమై ఉండొచ్చనే వాదన వచ్చింది. వారి కమ్యూనిటీకి చెందిన మహిళను రేప్ చేశారని వారు ఈ దాష్టీకానికి ఒడిగట్టినట్టు ఓ వార్త వచ్చింది.
న్యూఢిల్లీ: మణిపూర్లో కుకీ తెగకు చెందిన ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మే 4వ తేదీన చోటుచేసుకున్న ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. మే నెలలోనే మైతేయి, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పుడే ఈ దాడి జరగడం గమనార్హం. అయితే, ఈ దాడికి ఆ మూక ఉపక్రమించడానికి ఓ ఫేక్ వీడియో కారణం అని తెలుస్తున్నది. ఆ మూక ఒక్కసారిగా మతిభ్రమించినదానిగా మారి.. మహిళల పై దాష్టీకానికి ఆ వీడియో తక్షణ కారణంగా ఉన్నదని కొందరు చెబుతున్నారు.
మైతేయి కమ్యూనిటీకి చెందిన ఓ మహిళను కుకీ తెగలకు చెందిన వారు అత్యాచారం చేశారన్నది ఆ ఫేక్ వీడియోలోని సారాంశం. ఆ ఫేక్ వీడియో మైతేయి కమ్యూనిటీలోని కొందరిలో అగ్గి రాజేసింది. దీంతో కొందరు మైతేయి కమ్యూనిటీకి చెందిన వారు మూకగా ఏర్పడి కాంగ్పోక్పిలోని ఓ గ్రామానికి వెళ్లింది. కనిపించిన కుకీ తెగకు చెందిన వారిపై చిత్రహింసలకు పాల్పడాలని అనుకుంది.
ఆ మూకకు కుకీ తెగకు చెందిన ఐదుగురు కంటబడ్డారు. వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. 56 ఏళ్ల తండ్రి, 19 ఏళ్ల కొడుకు, 21 ఏళ్ల కూతురు ఉన్నారు. వారితోనే మరో ఇద్దరు మహిళలు (ఒకరికి 42 ఏళ్లు, మరొకరికి 52 ఏళ్లు) ఉన్నారు.
Also Read: Manipur Gangrape: గ్యాంగ్ రేప్ ప్రధాన నిందితుడి ఫొటో ఇదే.. అరెస్టు చేసిన పోలీసులు
మైతేయి కమ్యూనిటీకి చెందిన కొందరు మూకగా ఏర్పడి కుకీ ప్రజల కోసం ఆ గ్రామానికి వస్తున్నట్టు తెలుసుకున్న చాలా మంది కుకీలు ఆ ఊరు వదిలి పారిపోయారు. ఈ ఐదుగురు మాత్రం ఆలస్యంగా ఉపక్రమించారు. వారు కూడా సమీపంలోని అడవి వైపు పరుగెట్టడం మొదలు పెట్టారు. దారిలో పోలీసులు కనిపించారు. వారి సహాయం కోరారు. కొంత సేపటికి అటే ఈ మూక వచ్చింది. పోలీసుల కస్టడీలోని వారిని తమ అధీనంలోకి తెచ్చుకుని దాడికి పాల్పడ్డారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు.