ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా పోరాటం ఇంకా ముగియలేదు. సుప్రీం నిర్ణయాన్ని బిజెపి, కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు స్వాగతించాయి. కానీ, తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకించింది.  

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ కల్పించడాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది. ఈ నిర్ణయాన్ని బిజెపి, కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు స్వాగతించాయి. కానీ, తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకించింది. చట్టాన్ని రద్దు చేసేంత వరకు తన పోరాటం కోనసాగుతుందని తెలిపింది. సుప్రీం కోర్టు నిర్ణయంపై రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు డీఎంకే ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సీఎం స్టాలిన్ తన లాయర్ల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారట. సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని ఆయన అభివర్ణించారు. ఇది శతాబ్దాలుగా సాగుతున్న సామాజిక న్యాయం పోరాటానికి ఎదురుదెబ్బ తగిలిందని ఎంకే స్టాలిన్ అభిప్రాయం పడ్డారు. 

ఈడబ్ల్యూఎస్ కోటాను డీఎంకే వ్యతిరేకం

ఈడబ్ల్యూఎస్ కోటాను తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ రిజర్వేషన్ల కింద రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలో డీఎంకే ప్రభుత్వం ఒకటి. ఈ అంశంపై సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత..డిఎంకె నాయకుడు టి.తిరేమావలన్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు నిర్ణయంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోందని చెప్పారు.


ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను సమర్ధించిన సుప్రీం 

ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల్లోని పేదలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ కల్పించడం సుప్రీం కోర్టు సమర్ధించింది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించారు. మోడీ నేత్రుత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో 103 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా.. అగ్రవర్ణ పేదలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా పరిగణిస్తూ విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను కల్పించింది. అయితే ఈ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అలాగే.. రిజర్వేషన్లపై 1992లో సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిమితిని దాటిని ఎలా రిజర్వేషన్ కల్పిస్తారని పలువురు పిటిషనర్లు ప్రశ్నించారు. 

అయితే.. ఈ విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి( సీజేఐ)జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. ఈ ధర్మాసనంలో సీజేఐ యూయూ లలిత్ తోసహా న్యాయమూర్తులు జస్టిస్ దినేష్ మహేశ్వరి, ఎస్ రవీంద్ర భట్, బేల ఎం త్రివేది, జేబీ పార్దీవాలా కూడా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో సుప్రీం కోర్టు సమర్ధించింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు దినేష్ మహేశ్వరి, బేల ఎం త్రివేది, జేబీ పార్దీవాలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సమర్థించగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ మాత్రం విభేదించారు.