నేడు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశం కానుంది. ఇందులో కొత్త స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. శివసేన నుంచి ఒక ఎమ్మెల్యే, బీజేపీ నుంచి ఒకరు ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. కొత్తగా ఎన్నికైన  షిండే వర్గానికి ఈ ఎన్నిక చాలా కీలకం.

మ‌హారాష్ట్రలో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌రువాత మొదటి సారిగా అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశం సంద‌ర్భంగా మొద‌ట కొత్త స్పీక‌ర్ ను ఎన్నుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో రేపు ఏక్ నాథ్ షిండే ప్ర‌భుత్వం బ‌ల ప‌రీక్ష‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2021 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసినప్పటి నుంచి అసెంబ్లీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తాత్కాలిక స్పీకర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ప్రత్యేక పూజలు..

నేడు జరగనున్న ఎన్నికల్లో స్పీకర్ పదవి కోసం శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీ, బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్‌తో తలపడనున్నారు. నార్వేక‌ర్ ముంబైలోని కొలాబా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, సాల్వి రత్నగిరి జిల్లాలోని రాజాపూర్ సెగ్మెంట్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాల దృష్ట్యా అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నిక ఎంతో కీల‌క‌మైన‌ది. కొత్త ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇచ్చే ఎమ్మెల్యే స్పీక‌ర్ గా ఎన్నికైతే ఏక్‌నాథ్ షిండే పాటు 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత వేటును ఆయ‌న కొట్టివేసే అవ‌కాశం ఉంద‌ని న్యాయ నిపుణులు చెబుతున్నార‌ని ‘ఎన్ఢీటీవీ’ కథనం పేర్కొంది. 

Amravati Murder : ఫార్మ‌సిస్టు హ‌త్య‌ను దోపీడి కేసుగా త‌ప్పుదోవ ప‌ట్టించారు - ఎంపీ న‌వ‌నీత్ రాణా

షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా స్పీకర్ గుర్తిస్తే ఆ గ్రూపు మరే ఇతర రాజకీయ పార్టీలో విలీనం కావాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. తనకు 2/3వ వంతు మెజారిటీ ఉన్నందున తాను సేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడినని ఏకనాథ్ షిండే వాదిస్తూ వస్తున్నారు. నేటి అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్ ఎన్నిక, బల పరీక్ష నేపథ్యంలో షిండే తన 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు మరో 50 మంది ఎమ్మెల్యేల‌ను తీసుకొని ముంబైకి వ‌చ్చారు. కాగా శుక్ర‌వార‌మే శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఏక్ నాథ్ షిండేను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలకు పాల్పడ్డార‌ని కార‌ణాన్ని పేర్కొంటూ ఈ చ‌ర్య‌కు ఉప‌క్ర‌మించారు. అయితే షిండే వర్గం ఇప్పుడు ‘నిజమైన’ సేన కాబట్టి ఈ నిర్ణయాన్ని తాము సవాలు చేస్తామని చెబుతోంది. ఏక్ నాథ్ షిండే వర్గం బీజేపీ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన తరువాత.. ఇప్పుడు బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

Nupur Sharma: "ఇది మౌఖిక పరిశీలన, తీర్పు కాదు": నుపుర్ విష‌యంలో సుప్రీం సీరియ‌స్.. స్పందించిన లా మినిష్ట‌ర్

గత మంగళవారం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని దేవేంద్ర ఫడ్నవీస్ కలిశారు. ఎంవీఏ ప్ర‌భుత్వాన్ని స‌భ‌లో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాల‌ని కోరారు. దీంతో స‌భ‌లో బ‌లాన్ని నిరూపించుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఎంవీఏ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై శివసేన ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్గం సుప్రీంకోర్టుకు వెళ్లింది. గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల‌పై స్టే విధించాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనికి సుప్రీంకోర్టు నిరాక‌రించింది. దీంతో బుధవారం సాయంత్రం ఉద్ద‌వ్ ఠాక్రే త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. కాగా అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కోరుతూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూలై 11న విచారించనుంది. అయితే అదే రోజు ఎమ్మెల్యేల అనర్హత వేటును సవాల్ చేస్తూ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను కూడా అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది.