రాజస్థాన్‌లోని జైపూర్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి. జైపూర్‌లో ఉదయం 4:09 నుండి 4:23 గంటల వరకు రెండు భారీ ప్రకంపనలు సంభవించాయి. రాజధానితోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో 4:30 గంటల వరకు ప్రకంపనలు వచ్చాయి.

భూకంపం దెబ్బకు ‘బతుకు జీవుడా’ అంటూ స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కళ్ల ముందు నివాసాలు భవనాలు, పరిసరాలు కదులుతుంటే.. నిట్టూర్చుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిల్చున్నారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఫోన్ చేసి వారి బాగోగులు తెలుసుకోవడం మొదలుపెట్టారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున 4.09 గంటలకు భూకంపం సంభవించింది. జైపూర్‌లోని రియాక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. ప్రాణనష్టం లేదా నష్టానికి సంబంధించిన నివేదికలు ఇంకా తెలియరాలేదు.

ఈ ప్రకంపనలపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పందిస్తూ.. "జైపూర్‌తో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో భూకంపం సంభవించింది. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను!" అని ట్వీట్ చేశారు.

అంతకుముందు గురువారం తెల్లవారుజామున మిజోరంలోని ఎన్‌గోపాకు తూర్పున 61 కిలోమీటర్ల దూరంలో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని NCS నివేదించింది. NCS ప్రకారం, భూకంపం 80 కిలోమీటర్ల లోతులో సంభవించింది.