ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం.. ఆరా తీస్తున్న ఢిల్లీ పోలీసులు..!!
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి మోదీ అధికారిక నివాసంపై డ్రోన్ సంచారం కలకలం రేపింది. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా సమాచారం.
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి మోదీ అధికారిక నివాసంపై డ్రోన్ సంచారం కలకలం రేపింది. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధానమంత్రి భద్రతను నిర్ధారించే పనిలో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు డ్రోన్ను చూసినట్టుగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు డ్రోన్ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు డ్రోన్ను గుర్తించలేదని సమాచారం.
ఇదిలాఉంటే, ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు స్పందించారు. ప్రధాని నివాసం పైనున్న నో ఫ్లయింగ్ జోన్లో డ్రోన్ను ఎగురుతున్నట్లు సమాచారం అందిందని.. ఎస్పీజీ అధికారులు ఉదయం 5:30 గంటలకు పోలీసులను సంప్రదించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. ఇక, ప్రధాని మోదీ నివాసం రెడ్ నో ఫ్లై జోన్ లేదా నో డ్రోన్ జోన్ కిందకు వస్తుందనే సంగతి తెలిసిందే. అయితే అలాంటి చోట డ్రోన్ సంచారం ప్రస్తుతం కలకలం రేపుతోంది.