బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై బీజేపీ, కాంగ్రెస్, శివసేనలు మండిపడ్డాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని శివసేన, బీజేపీ నాయకులు పోలీసులను కోరారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

సాయిబాబా దేవుడు కాదు.. ఫకీరు మాత్రమే అంటూ బాగేశ్వర్ ధామ్ చీఫ్, స్వయం ప్రకటిత దైవం ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన, కాంగ్రెస్, బీజేపీ మండిపడ్డాయి. ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. అయితే సమాజంలోని అనేక వర్గాలు ఆరాధించే సాయిబాబాపై వ్యాఖ్యలు చేశారంటూ శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం) యువసేన నాయకుడు రాహుల్ కనల్ ముంబై పోలీసులకు లేఖ రాశారు. 
అలాగే మహారాష్ట్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా బాగేశ్వర్ ధామ్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వయం ప్రకటిత దైవం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పాటిల్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఎవరీ ధీరేంద్ర శాస్త్రి ? అసలేం అన్నారు ? 
మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లాలోని బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారే ధీరేంద్ర శాస్త్రి. ఆయన బాగేశ్వర్ ధామ్ సర్కార్ గా ప్రసిద్ధి చెందారు. ఆయన ఆ తన సొంత రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ప్రాచుర్యం పొందారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ‘కథ’ అని పిలిచే మతపరమైన ప్రసంగాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఇటీవల జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాయిబాబా దేవుడా ? లేక ఫకీరా అని ఓ డాక్టర్ వేదికపై నుంచి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. సాయిబాబా కేవలం ఫకీరు లేదా సాధువు అని, కానీ దేవుడు కాదని అన్నారు. దీనికి కారణాన్ని కూడా ఆయన వివరించారు. 

Scroll to load tweet…

సాయిబాబాకు శంకరాచార్యులు దైవస్థానం ఇవ్వలేదని ధీరేంద్ర శాస్త్రి చెప్పారు. ‘‘శంకరాచార్యులు మన ధర్మానికి ప్రధాని కాబట్టి ఆయనను గౌరవించడం ప్రతీ సనాతనీ కర్తవ్యం. గోస్వామి తులసీదాస్ జీ అయినా, సూర్దాస్ జీ అయినా మన ధర్మానికి చెందిన ఏ సాధువు అయినా కానివ్వండి.. ఆయనను గొప్ప వ్యక్తి, యుగ పురుషుడు, కల్ప పురుషుడు అనొచ్చు. కానీ దేవుడు అనలేం’’ అని అన్నారు. అయితే ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. ఎవరి నమ్మకాన్ని దెబ్బతీయలేమని, కానీ సాయిబాబా సాధువు, ఫకీరు కావచ్చు కానీ దేవుడు కాలేరని అన్నారు.

ఆయన తన వ్యాఖ్యలను సమర్థిస్తూ ‘‘ప్రజలు మనం ఇలా మాట్లాడడాన్ని వివాదం చేస్తారు.. కానీ నక్క చర్మాన్ని ధరించినంత మాత్రనా.. అది సింహం అయిపోదు’’ అని అన్నారు. “మనం శంకరాచార్యుల గొడుగు వేసుకుని, సింహాసనం మీద ఉంచి శంకరాచార్యులమని చెప్పుకుంటే.. మనం శంకరాచార్యులం అయిపోతామా ? కాలేము కదా.. దేవుడు మాత్రమే దేవుడు. సాధువులు కేవలం సాధువులే. ఓ వ్యక్తి తనకున్న నమ్మకాన్ని అలాగే ఉంచుకోవాలి. కానీ సాయి దేవుడు కాదు అని మన శంకరాచార్యులు చెప్పారు. ’’ అని అన్నారు.

తన వాదనకు బలం చేకూర్చేందుకు కోర్టు నిర్ణయాన్ని కూడా ప్రస్తావించారు. “సాయిబాబా సనాతనవాది కాదని, హిందువు కాదని కోర్టు చెప్పింది. అలాగే శంకరాచార్య జీకి క్షమాపణ కూడా చెప్పింది. సాయిబాబా దేవుడు కాదు. మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు. ఓ వ్యక్తి గురువు కావచ్చు. సాధువు కావచ్చు గొప్ప వ్యక్తి కావచ్చు, కానీ దేవుడు కాలేడు.’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యింది.