ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: సీబీఐ తర్వాత ఈడీ కూడా సిసోడియాకు క్లీన్ చిట్ ఇచ్చింది.. : ఆప్
ఆమ్ ఆద్మీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను నకిలీ కేసుల్లో ఇరికించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రధాని నరేంద్ర మోడీ దుర్వినియోగం చేశారని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం తెలిపింది. వార్తా సంస్థ పీటీఐ నివేదికల ప్రకారం.. మీడియాను ఉద్దేశించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. సీబీఐ దర్యాప్తు చేసిన తర్వాత ఈడీ కూడా సిసోడియాకు క్లీన్ చిట్ ఇవ్వడం ఆమ్ ఆద్మీ పార్టీకి సంతోషకరమైన విషయమని అన్నారు. "ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వివిధ ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. అయితే మనీష్ సిసోడియా నిందితుడు నంబర్-1 అయినప్పటికీ అతని నివాసానికి రాలేదు. వారు (ED అధికారులు) చనువుగా ఉన్నారు. అతని ఇంటికి వెళ్లడం అవమానకరమని భావించినందున వారు అతనిని విడిచిపెట్టారు"అన్నారాయన. అయితే, ఆప్ వాదనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పందించలేదు.
ఆమ్ ఆద్మీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను నకిలీ కేసుల్లో ఇరికించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రధాని నరేంద్ర మోడీ దుర్వినియోగం చేశారని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది. విద్యా, ఆరోగ్యానికి సహకారం అందించకుండా ప్రధాని మోడీ కేంద్ర ఎజెన్సీలను దుర్వినియోగం చేశారని ఢిల్లీ సర్కారు ఆరోపించింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని చేస్తున్న పోరాటమైతే గుజరాత్లో నేడు మద్యం మాఫియాపై ఈడీ దాడులు చేసి ఉండేదని భరద్వాజ్ ఆరోపించారు. "ఇది అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కాదు, కేజ్రీవాల్పై పోరాటం. ఈ మొత్తం ప్రయత్నం విద్య-ఆరోగ్యంలో కేజ్రీవాల్ చేస్తున్న కృషిని ఆపడానికి" అని విమర్శించారు. అంతకుముందు, గత వారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఉద్యోగి ఆత్మహత్యకు ప్రతిస్పందనగా మనీష్ సిసోడియా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "మీకు కావాలంటే నన్ను అరెస్టు చేయండి, కానీ మీ అధికారుల కుటుంబాలను నాశనం చేయవద్దు" అని అన్నారు.
ఇదిలావుండగా, సిసోడియా ప్రకటనపై సీబీఐ స్పందిస్తూ, "మనీష్ సిసోడియా తప్పుదోవ పట్టించే ప్రకటనను సీబీఐ తీవ్రంగా ఖండించింది. పెద్దమనిషి దివంగత జితేంద్ర కుమార్కు కేసు దర్యాప్తుతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది" అని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది.