‘మా ఊరిలో దళిత పెళ్ళికొడుకులు గుర్రాలు ఎక్కరు, నీకు ఎంత ధైర్యం?' అంటూ అగ్రవర్ణాల వ్యక్తులు ఓ పెళ్లికొడుకు మీద దాడి చేశారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు.
ఆగ్రా : పెళ్లిలో దళిత వరుడు గుర్రం ఎక్కాడని అగ్రవర్ణాలు దారుణానికి ఒడిగట్టారు. మా ఊర్లో దళితులు గుర్రాలు ఎక్కరు. నీకెంత ధైర్యం అంటూ.. 22 ఏళ్ల దళిత వరుడిని రాడ్లు, కర్రలతో కొట్టి, గుర్రం మీదినుండి బలవంతంగా దించారు. మండపంలో ఉన్న మహిళల మీద కూడా అగ్రవర్ణాల పురుషులు దాడి చేసి వేధించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా నగరంలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహల్లా ప్రాంతంలో మే 4వ తేదీ రాత్రి జరిగింది.
దీనిమీద మే 9వ తేదీన వరుడి అత్తగారు గీతాదేవి ఫిర్యాదు చేయడంతో నిందితుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. “నా అల్లుడు అజయ్ కుమార్, ఇతర అతిథులతో కలిసి పెళ్లి జరగాల్సిన రాధాకృష్ణ కళ్యాణ మండపంలోకి ప్రవేశించినప్పుడు, వారిపై దాదాపు 20-25 మంది వ్యక్తులు దాడి చేశారు. వీరంతా ప్రధానంగా ఠాకూర్లు. వారు మమ్మల్ని కులం పేరుతో దూషిస్తూ... దళితులు అంటూ తిట్టారు. ‘మా ఊరిలో దళిత పెళ్ళికొడుకులు గుర్రాలు ఎక్కరు, నీకు ఎంత ధైర్యం?' అంటూ దాడికి దిగారు.పెళ్లిలో విద్యుత్ సరఫరాను మూడు-నాలుగు సార్లు ఆపేశారు. వేదిక వద్ద మహిళలను వేధించారు”అని గీత ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
Manipur Violence: మణిపూర్ అల్లర్లు.. 11 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు
ఎస్హెచ్ఓ నీరజ్ శర్మ మాట్లాడుతూ, "నలుగురి నిందితులు - యోగేష్ ఠాకూర్, రాహుల్ కుమార్, సోనూ ఠాకూర్, కునాల్ ఠాకూర్ లతో పాటు పలువురు గుర్తుతెలియని వ్యక్తులపై ఎస్సీ,ఎస్టీ చట్టం, ఐపీసీ సెక్షన్లు 354 (స్త్రీల మీద దాడి లేదా వారిని అవమానించేలా క్రిమినల్ ఫోర్స్) 147 (అల్లర్లకు శిక్ష), 148 (అల్లర్లు, ఆయుధాలు ధరించి భయపెట్టడం), 452 (దాడి లేదా ఇంట్లోకి అతిక్రమణ), 352 (దాడికి శిక్ష), 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష) 505 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వక అవమానం) కింద కేసు నమోదు చేయబడింది"
సర్కిల్ అధికారి (సదర్), అర్చన సింగ్ మాట్లాడుతూ, "నిందితుల్లో ఒకరైన రాహుల్ని అరెస్టు చేశారు. మిగతా వారిని పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నాం. తదుపరి విచారణ కొనసాగుతోంది." వధువు సోదరుడు మనీష్ కుమార్ మాట్లాడుతూ, "మేము దాడి చేసినవారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, వారు మమ్మల్ని లాఠీలతో కొట్టడం ప్రారంభించారు, కొంతమంది అతిథులు తీవ్రంగా గాయపడ్డారు, తరువాత, కుటుంబంలోని వారు అత్యవసర హెల్ప్లైన్ నంబర్, 112 కు డయల్ చేసారు. సమాచారం అందుకున్న తర్వాత, దాదాపు 10-12 మంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
