కోవిడ్ ఎఫెక్ట్ : క్రిమినల్ గా మారిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్..
కోవిడ్ కారణంగా ఐదంకెల జీతం కోల్పోయి.. అప్పులు చుట్టుముట్టడంతో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ చేస్తూ క్రిమినల్ గా మారాడో సాఫ్ట్ వేర్ ఎంప్లాయి. హైదరాబాద్ పోలీసులు పట్టుకోవడంతో విషయం బైటికి వచ్చింది. వివరాల్లోకి వెడితే...
కోవిడ్ కారణంగా ఐదంకెల జీతం కోల్పోయి.. అప్పులు చుట్టుముట్టడంతో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ చేస్తూ క్రిమినల్ గా మారాడో సాఫ్ట్ వేర్ ఎంప్లాయి. హైదరాబాద్ పోలీసులు పట్టుకోవడంతో విషయం బైటికి వచ్చింది. వివరాల్లోకి వెడితే...
బెంగళూరుకు చెందిన హేమంత్కుమార్ బాగా చదువుకున్నాడు. బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎథికల్ హ్యాకర్గా పని చేశాడు. ఐదంకెల జీతంతో జీవితం సాఫీగా సాగిపోయేది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఓ ఫ్లాట్ కొన్నాడు. కోవిడ్ దీన్నంతా తలకిందులు చేసింది. లాక్ డౌన్ ఆ తరువాతి పరిణామాల్లో హేమంత్ కుమార్ ఉద్యోగం పోయింది.
ఇంటికి కట్టాల్సిన ఈఎంఐలు, అప్పులు, ఇంట్లో ఖర్చులు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వాటికోసం మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ మొదలెట్టాడు. పలు మాట్రిమోనియల్ సైట్స్లో తన పేరు, వివరాలను రిజిస్టర్ చేసుకున్నాడు. ఆయా సైట్స్ లో ఉన్న యువతుల ప్రొఫైల్స్లో కొన్నింటిని ఎంపిక చేసుకునేవాడు. వారిని వివాహం చేసుకోవడానికి ఇష్టమేనని మెసేజ్ లు పంపేవాడు. తాను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నానని చెప్పేవాడు. తన వల్లోపడిన వారితో కొన్నాళ్లు చాటింగ్, ఫోన్ కాల్స్ కొనసాగించేవాడు.
బాగా నమ్మకం కుదిరాక తన ప్లాన్ అమలు చేసేవాడు హేమంత్ కుమార్. తనకు అర్జెంటుగా అవసరముందనో, తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదనో ఏదో ఒక కారణం చెప్పేవాడు. అవసరానికి డబ్బులు లేవని, ఆ యువతిని డబ్బులు అడిగేవాడు. అలా వారి దగ్గరినుండి అందిన కాడికి డబ్బులు తీసుకుని మాయమయ్యేవాడు.
కొన్నిసార్లు తన ఫోన్ నెంబర్ మార్చేయగా.. మరి కొన్నిసార్లు ఎదుటి వారివి బ్లాక్ చేస్తున్నాడు. ఇతడి చేతిలో మోసపోయిన అనేక మంది యువతులు ఏం చేయలేక కామ్ గా ఉండిపోయారు. బెంగళూరుకు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో అక్కడి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్పై వచ్చినా, మరో పేరుతో మరో మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు.
హుబ్లీ చెందిన యువతిని మోసం చేయడంతో ఆమె అక్కడ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. హైదరాబాద్కు చెందిన మరో యువతి నుంచి కూడా హేమంత్కుమార్ రూ.2.1 లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో హేమంత్కుమార్పై నగరంలో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి నిందితుడు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.