ఎయిరిండియాపై కరోనా పడగ.. మహమ్మారి బారినపడి 56 మంది మృతి: కేంద్ర పౌర విమానయాన శాఖ
ఎయిరిండియాలో కరోనా వల్ల 56 మంది ఉద్యోగులు చనిపోయారు. ఈ నెల 14 వరకు ఎయిరిండియాలో కొవిడ్ మృతుల వివరాలను కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ లోక్సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు
కరోనా మహమ్మారి సోకడంతో ఎయిరిండియాలో 56 మంది ఉద్యోగులు మృతిచెందినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోకి కొవిడ్ ప్రవేశించినప్పటి నుంచి ఈ నెల 14 వరకు ఎయిరిండియాలో కొవిడ్ మృతుల వివరాలను కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ లోక్సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఎయిరిండియాలో 3523 మంది సిబ్బంది కొవిడ్ బారిన పడగా.. వీరిలో 56 మందిని ఈ వైరస్ బలి తీసుకుందన్నారు.
ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకొనేందుకు పలు చర్యలు చేపట్టినట్టు కేంద్రమంత్రి తెలిపారు. మృతి చెందిన ఒక్కో శాశ్వత ఉద్యోగి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున, ఒప్పంద ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. కొవిడ్ సోకిన సిబ్బందికి వేతనంతో కూడిన 17 రోజుల క్వారంటైన్ సెలవును మంజూరు చేయడంతో పాటు వైద్య సదుపాయాలు కూడా కల్పించామని వీకే సింగ్ తెలిపారు.