దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందని త్వరలో వారి జనాభా హిందువులను మించిపోతుందని కొందరు పేర్కొంటున్న నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2028 నాటికి హిందువులు, ముస్లింల్లో సంతాన సాఫల్య రేటు ఒకే విధంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2028 నాటికి హిందువులు, ముస్లింల్లో సంతాన సాఫల్య రేటు ఒకే విధంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ అధ్యయనం ప్రకారం 1951 నుంచి ముస్లింల్లో సంతానోత్పత్తి రేటు హిందువులతో పోలిస్తే అధికంగా తగ్గుతోందని, ప్రస్తుతం ముస్లింల్లో సంతాన సాఫల్య రేటు 2.7 శాతం కాగా, హిందువుల్లో ఇది 2.3 శాతంగా ఉందని.. 2028 నాటికి ఇది హిందూ, ముస్లింలలో సమానంగా ఉంటుందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందని త్వరలో వారి జనాభా హిందువులను మించిపోతుందని కొందరు పేర్కొంటున్న నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. సెప్టెంబర్ మొదటి వారంలోనూ ఆయన ఇదే అంశంపై మాట్లాడారు. ముస్లింల జనాభా పెరుగుదల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని మోహన్ భగవత్ సహా ఆరెస్సెస్ ప్రచారక్లకు ఆయన సవాల్ విసిరారు.
ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుతోందని, హిందువుల కంటే ముస్లింలు ఈ దేశంలో ఎన్నటికీ మెజారిటీలు కాబోరని తాను నిరూపిస్తానని దిగ్విజయ్ అన్నారు. ధరల మంటతో సామాన్యుడు భార్యా, పిల్లలతో బతకలేని పరిస్ధితులు ఉండగా, ఓ ముస్లిం నలుగురు భార్యలు, వారికి పుట్టిన పిల్లలతో ఎలా నెట్టుకొస్తారని ఆయన ప్రశ్నించారు.
