Asianet News TeluguAsianet News Telugu

మరో కశ్మీరేతరుడి హత్య.. చాట్ అమ్ముకునే బిహారీ, యూపీ లేబర్‌పై ఉగ్రవాదుల కాల్పులు

జమ్ము కశ్మీర్‌లో పౌరులపై ఉగ్రవాదుల కాల్పులు ఆగడం లేదు. తాజాగా శ్రీనగర్‌లోని ఈద్గా ఏరియాలో ఈ రోజు సాయంత్రం పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకీతో కాల్చి చంపారు. రెండు వారాల్లో ఇది ఎనిమిదో హత్య. జమ్ము కశ్మీర్‌కు చెందనివారినే ఉగ్రవాదులు టార్గెట్ చేయడం కలకలం రేపుతున్నది.
 

civilian shot dead in jammu kashmir by terrorists
Author
Srinagar, First Published Oct 16, 2021, 8:23 PM IST

శ్రీనగర్: Jammu Kashmirలో రక్తపాతం పారుతున్నది. అటు భద్రతా బలగాలకు, Terroristలకు మధ్య హోరా హోరీ Encounterలు జరుగుతున్నాయి. మరోవైపు సాధారణ పౌరుల ప్రాణాలూ ఉగ్రవాదుల తూటాలకు బలైపోతున్నాయి. తాజాగా, శ్రీనగర్‌లోని ఈద్గా ఏరియాలో సాయంత్రం 6.40గంటల ప్రాంతంలో చాట్ అమ్ముకునే ఓ బిహారీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కార్పెంటర్‌పైనా కాల్పులు జరిపారు. ఇందులో బిహార్‌కు చెందిన ఆ వీధివ్యాపారి మరణించాడు.

శ్రీనగర్, పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు నాన్ లోకల్ లేబర్ల‌పై కాల్పులు జరిపారని జమ్ము కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇందులో బిహార్‌లోని బంకాకు చెందిన అరవింద్ కుమార్ షా శ్రీనగర్‌లో తూటాలు తగిలి మరణించారని వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాగిర్ అహ్మద్‌ పుల్వామాలో ఉగ్రవాదుల కాల్పులకు గురై గాయపడ్డారని తెలిపారు. ఈ రెండు ప్రాంతాలను సీజ్ చేసి ఉగ్రవాదుల కోసం గాలింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

అరవింద్ కుమార్ షాను పాయింట్ బ్లాంక్ రేంజ్‌ నుంచి ఉగ్రవాదులు కాల్చి చంపినట్టు కొన్నివర్గాలు తెలిపాయి. అరవింద్‌ను హాస్పిటల్‌కు తరలించగానే అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు చెప్పారు.

గత రెండు వారాలుగా కశ్మీర్‌లో పౌరులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది కశ్మీరీ పండిట్‌లు తాత్కాలిక శిబిరాల్లోకి వెళ్లారు. ప్రధానమంత్రి స్పెషల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ కింద ఉద్యోగాల కోసం తిరిగి కశ్మీర్ వెళ్లిన కుటుంబాలు చెప్పాపెట్టకుండా ఉన్నప్రాంతాలను వదిలిపెట్టి తరలిపోతున్నారు.

వీధి వ్యాపారిని చంపడంపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. పొట్టచేతపట్టుకుని ఉపాధి వెతుక్కుంటూ కశ్మీర్‌కు రావడమే ఆయన చేసిన పాపమా అంటూ ఆవేదన చెందారు. ఆయన హత్యను ఖండించారు. కాగా, జమ్ము కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ లీడర్ సాజద్ లోనె కూడా ఈ ఘటనను ఖండించారు. ఇది పూర్తిగా ఉగ్రవాదమేనని, సిగ్గుచేటు అని పేర్కొన్నారు.

Also Read: కశ్మీర్‌లో సాధారణ ప్రజల ఊచకోత.. రంగంలోకి సైన్యం, 570 మంది ఉగ్రవాదుల అరెస్ట్

గత రెండు వారాలుగా ఎనిమిది మంది పౌరులను ఉగ్రవాదులు హతమార్చారు. ఇందులో ఐదుగురు ముస్లిమేతరులు కావడంతో ఉగ్రవాదుల టార్గెట్ హిందువులు, కశ్మీర్ బయటి నుంచి వచ్చినవారేనని చర్చ జరుగుతున్నది.

పౌరులపై దాడులు పెరగ్గానే పోలీసులు రంగంలోకి దిగారు. కనీసం 900 మంది వేర్పాటువాదులతో లింక్ ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ ముమ్మరం చేశారు. వారం వ్యవధిలోనే 13 మంది టెర్రరిస్టులు హతమైనట్టు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios