అమావాస్య రోజు నరబలి ఇస్తే మంచిదని..
నరబలి ఇవ్వడం ద్వారా అదృష్టం కలిసివస్తుందని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాగా.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
మూఢనమ్మకంతో ఆరేళ్లబాలుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన బెంగళూరు పట్టణంలో చోటుచేసుకుంది. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఆర్ముగం(30) అనే వ్యక్తి.. తన ఎదురు ఇంట్లో ఉన్న ఆరేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశాడు. అమావాస్య రోజు నరబలి ఇస్తే.. మంచి జరుగుతుందని భావించిన ఆర్ముగం.. భీమణ్ణ గార్డెన్లో తన ఇంటి పక్కన ఉంటున్న బాలుడ్ని నిర్జన ప్రదేశానికి సోమవారం రాత్రి తీసుకొని వెళ్లి, అతని తలపై బండరాయి వేసి హత్య చేశాడు.
ఆర్ముగం మూఢనమ్మకాలను ఎక్కువగా విశ్వసిస్తాడని తెలుస్తోంది. నిందితుడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్న అతను.. నరబలి ఇవ్వడం ద్వారా అదృష్టం కలిసివస్తుందని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాగా.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను నిందితుడి నుంచి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.