Actor Sonu Sood: అప్పుడే వస్తా.. పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్
Actor Sonu Sood: తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, సామాజిక సేవలో పాల్గొంటున్న తన సోదరికి మాత్రమే మద్దతు ఇస్తున్నానని సోనూసూద్ పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వస్తానని సోనూసూద్ ప్రకటించారు. తన సామాజిక కార్యక్రమాలను, ఎన్నికలు రెండింటినీ నిర్వహించడానికి తనకు తగినంత పెద్ద టీమ్ లేదని అన్నారు
Actor Sonu Sood: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీకి మరో అవకాశం ఇవ్వాలని నటుడు సోనూసూద్ చెప్పారు, ఏ రాజకీయ పార్టీతో తనకి సంబంధం లేదని కూడా చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంచివాడు, నిజాయితీపరుడని, ఆయన ఎప్పుడూ హృదయపూర్వకంగా మాట్లాడుతారని కితాబ్ ఇచ్చారు. గతంలో సీఎం చన్నీని కలిశాననీ, గత మూడు నెలల్లో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పని ప్రశంసించదగినవనీ, ఆయన మరోసారి అవకాశమివ్వాలని అన్నారు. ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉందనీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్పై, తాను రాజకీయంగా తనను పెద్దగా అనుసరించలేదని, చాలా సంవత్సరాల క్రితం కళాకారుడిగా ఆయనను ఒకసారి కలిశానని అన్నారు. అతను నాయకుడిగా ఎలా ఎదుగుతాడో తాను ఇంకా చూడలేదనీ, కానీ అతని పార్టీ నిర్ణయించినట్లయితే వారు దాని గురించి ఆలోచించాలని అన్నారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, తన సోదరి మాళవిక సూద్ సచార్ .. మోగా అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్నారనీ, తనకు మద్దతు.. ఆమెతో కలిసి ప్రచారం చేస్తానని మరోసారి పునరుద్ఘాటించారు.
సమాజసేవ అనేది తమ రక్తంలోనే ఉన్నదని, తన తల్లి ఒక ప్రొఫెసర్ అని, పిల్లలకు తన జీవిత పాఠాలన్నీ నేర్పారని అన్నారు. అదేవిధంగా తన తండ్రి ఒక సామాజిక కార్యకర్త అని, మెగాలో చాలా పాఠశాలలు, కళాశాలలు, ధర్మశాలలను తన కుటుంబం నిర్మించారని అన్నారు. ఇప్పుడు తన సోదరి కూడా తన తల్లిదండ్రుల అనుసరిస్తోందని, పంజాబ్లోని మోగా సిటీలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని సోనూసూద్ చెప్పారు.
మోగాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలావరకు పూర్తికావడానికి తమ సోదరి మాళ్వికనే కారణమన్నారు. మోగాలో నిరక్షరాసత్య, పేదిరికం అనేవి ప్రధాన సమస్యలుగా ఉన్నాయని, ఈ సమస్యల పరిష్కారం కోసం తన సోదరి ఎంతోకాలంగా పోరాడుతున్నారని సూద్ తెలిపారు. ఇప్పుడు తన సోదరి మాళ్వికా సూద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోగా అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారని, ఆమెను ప్రజలు మంచి మెజారిటీతో గెలిపిస్తారని సోనూసూద్ ధీమా వ్యక్తంచేశారు.
ఈ తరుణంలో తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తాను సామాజిక సేవ చేయడం ప్రారంభించినప్పటి నుంచి అన్ని పార్టీలతోనూ కలిసి పనిచేస్తున్నని తెలిపారు. ఢిల్లీ అప్ ప్రభుత్వం తమ ప్రయత్నాలలో తనను అంబాసిడర్గా పేర్కొన్న తర్వాత వివిధ పార్టీల నుంచి చాలా ఆఫర్లు వచ్చాయనీ, రాజ్యసభ సీటు, ఇతర ఉన్నత పదవులు తనకు ఆఫర్ చేశారని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వస్తానని సోనూసూద్ ప్రకటించారు. తన సామాజిక కార్యక్రమాలను, ఎన్నికలు రెండింటినీ నిర్వహించడానికి తనకు తగినంత పెద్ద టీమ్ లేదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో ఆయన భేటీ అనంతరం జరిగిన ఆదాయపు పన్ను శాఖ రైడ్ చేసిన విషయం తెలిసిందే. తాను విచారణకు సహకరిస్తున్నట్లు చెప్పారు.