బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్పై కేంద్రం కీలక నిర్ణయం.. పైలట్ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిదారులకు ఆహ్వానం
విద్యుత్ శక్తి కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని అమలు చేయడానికి ఆసక్తిదారుల నుంచి ఆహ్వానించాలని నిర్ణయించింది.
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు సంక్షోభం నెలకొందన్న వార్తలు వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. డిస్కమ్లను పవర్ పంపిణీపై అకౌంట్ మెయింటెయిన్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా 1000 మెగావాట్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(బీఈఎస్ఎస్)ను పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఆసక్తిదారులను ఆహ్వానించింది. ఇది నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖల సంయుక్త కృషి కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో Energy storage system ఏర్పాటు చేయడానికి ఈ రెండు శాఖలు రోడ్ మ్యాప్ గీస్తున్నాయని వివరించింది.
2030 కల్లా నూతన, పునరుత్పాదక శక్తి శాఖ 450 గిగా వాట్లను ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని కలిగి ఉందని, ఈ లక్ష్య ఛేదనలో తాజా నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని కేంద్రం తెలిపింది. ఈ శాఖ పరిధిలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ మేరకు 1000 మెగావాట్ అవర్ల BESS వినియోగం, కొనుగోలుకు సంబంధించి expression of interestను ఆహ్వానించింది.
ఈ నెల 28న బిడ్డింగ్ కంటే ముందు ఓ కాన్పరెన్స్ షెడ్యూల్ చేసుకున్నట్టు వివరించింది. అన్ని పక్షాల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత తుది ఆర్ఎఫ్ఎస్ డాక్యుమెంట్లను నవంబర్ తొలివారంలో విడుదల చేస్తామని పేర్కొంది. బీఈఎస్ఎస్ వినియోగం, కొనుగోలుపై సమగ్ర గైడ్లైన్స్ విడుదల చేస్తామని వివరించింది.
Also Read: పంపిణీ చేస్తున్న విద్యుత్ ఎంత? లెక్కలు వేయండి.. డిస్కమ్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్
ప్రస్తుత ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్తోపాటుగా ఈ పునరుత్పాదక ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్నూ వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ గ్రిడ్ ఎలిమెంట్ సామర్థ్యాన్ని పెంచుతుందని, దానిలోని అస్థిరతను తొలగిస్తుందని కేంద్రం పేర్కొంది. ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగ్మెంటేషన్ ఇన్వెస్ట్మెంట్ సొమ్మునూ ఈ విధానం ద్వారా కాపాడుకోవచ్చునని వివరించింది.
స్టోరేజీ అనేది సేవలు, నిర్వహణ సమతుల్యానికి కీలకమని ఆ ప్రకటన వెల్లడించింది. లోడ్ డిస్పాచర్స్ స్టోరేజీ సిస్టమ్ను ఫ్రిక్వెన్సీ కంట్రోల్ చేయడానికి వినియోగించవచ్చునని, అంతర్గతంగా ఉన్న అస్థిరతతను, లోటుపాట్లను ఈ రకంగా అధిగమించవచ్చునని తెలిపింది.