Punjab Crisis : ‘అప్పుడు టీమిండియాను మధ్యలో వదిలేశాడు, ఇప్పుడు...’ సిద్ధూపై అమరీందర్ ఘాటు వ్యాఖ్యలు..
సిద్ధూ తనకు చిన్నప్పటినుంచి, ఆయనో ఒంటరి వాడని అన్నారు. ఆనాడు భారత జట్టును ఇంగ్లాండ్లో వదిలివేసి వచ్చినట్లే... ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా మధ్యలోనే వదిలేసి మరో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.
చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) అనూహ్య రాజీనామాతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్నికల వేళ సిద్దు రాజీనామాతో సంక్షోభంలో పడిన కాంగ్రెస్ పార్టీ (Punjab Congress Crisis) ఈ సమస్యను రాష్ట్ర నాయకత్వమే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. సిద్ధూ కు స్థిరత్వం లేదంటూ దుయ్యబట్టిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ (Amarinder Singh) తాజాగా ఆయనపై మరిన్ని విమర్శలు గుప్పించారు.
సిద్ధూ తనకు చిన్నప్పటినుంచి, ఆయనో ఒంటరి వాడని అన్నారు. ఆనాడు భారత జట్టును ఇంగ్లాండ్లో వదిలివేసి వచ్చినట్లే... ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా మధ్యలోనే వదిలేసి మరో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న అమరేందర్ సింగ్ అక్కడ విలేకరులతో మాట్లాడారు. సిద్ధుని ఉద్దేశిస్తూ.. ‘ ఈయన అస్థిరమైన, ప్రమాదకరమైన వ్యక్తి అని నేను ముందునుంచి చెబుతూనే ఉన్నాను. తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు. జట్టు ఆటగాడిగా ఉండలేడు. అందుకే 1996లో భారత జట్టును ఇంగ్లాండ్లో మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు. సిద్దు అసలైన వ్యక్తిత్వం అదే. నా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ పదవికి న్యాయం చేయలేదు.
పాకిస్తాన్తో 600 కిలోమీటర్ల సరిహద్దులు కలిగిన పంజాబ్ చాలా సున్నితమైన, సమస్యాత్మకమైన రాష్ట్రం. సిద్ధూకి అతడి క్రికెట్ స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్( పాక్ ప్రధాని), ఐఎస్ఐ ఛీఫ్ ఒమర్ జావేద్ బజ్వాతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అది దేశ భద్రతకు తీవ్ర ముప్పు లాంటిదే’ అని ఆరోపించారు.
ఇక పంజాబ్ కొత్త సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ నిర్ణయాలు నచ్చకే సిద్దు రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలపై స్పందించిన కెప్టెన్... ‘కేబినెట్ అనేది పూర్తిగా సీఎం కు సంబంధించిన విషయం. ఇందులో సిద్దు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. సిద్ధాంతాలు నచ్చకే రాజీనామా చేస్తున్నా అని చెబుతున్నారు. కానీ ఆయనకు ఏం విలువలు, సిద్ధాంతాలున్నాయి. చూడండి… అతి త్వరలోనే సిద్ధూ కాంగ్రెస్ ను వదిలేసి మరో పార్టీతో చేతులు కలుపుతాడు’ అని చెప్పుకొచ్చారు.
పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య మలుపు: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
1996లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో కెప్టెన్ అజారుద్దీన్ తో విభేదాలు రావడంతో సిద్దూ టోర్నీని మధ్యలోనే విడిచి పెట్టి ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు హరీష్ రావత్… బుధవారం చండీఘడ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
అయితే కాంగ్రెస్ అధిష్టానం వద్దని చెప్పడంతో రావత్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ సమస్యను పంజాబ్ సీఎం చన్నీనే పరిష్కరించుకోవాలని పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చన్నీ నేడు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.