పెళ్లింట విషాదం... వరుడితో సహా ఇద్దరు సోదరీమణులు సజీవదహనం
అక్కాచెల్లితో పాటు ఓ యువకుడు మంటల్లో చిక్కుకుని సజీవదహనమైన విషాద ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.
కోల్కతా : మరికొద్దిరోజుల్లో పెళ్ళిపీటలు ఎక్కాల్సిన యువకుడితో పాటు సోదరీమణులు సజీవదహనం అయ్యారు. దీంతో పెళ్లిబాజలు మోగాల్సిన ఇంట చావుబాజా మోగగా పెళ్ళిపీటలు ఎక్కాల్సిన వాడు పాడె ఎక్కాడు. సోదరుడి పెళ్లిముహూర్తం పెట్టుకునే శుభకార్యం కోసం పుట్టింటికి వచ్చిన అక్కాచెల్లెల్లు ప్రాణాలు కోల్పోయారు. ఇలా ముగ్గురు తోబుట్టువులు మంటల్లో చిక్కుకుని మృతిచెందిన విషాద ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బర్దమాన్ జిల్లా దుర్గాపూర్ కు చెందిన హప్నా సోరేన్ కు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లకు ఇప్పటికే పెళ్లికాగా కొడుకు మంగళ్ సోరెన్ కు ఇటీవలే సంబంధం కుదిరింది. అమ్మాయి తరపువారు ఇవాళ(ఆదివారం) పెళ్లి ముహూర్తం ఖరారు చేయడానికి వస్తుండటంతో అక్కాచెల్లి సుమీ సోరెన్(35), బహమనీ సోరెన్(23) పుట్టింటికి వచ్చారు.
నిన్న(శనివారం) తెల్లవారుజామున బయటకు వెళ్లిన హఫ్నా సోరెన్ తిరిగి ఇంటికి చేరుకుని మంటలు రావడం గమనించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లిచూడగా కొడుకుతో పాటు ఇద్దరు కూతుళ్లు మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయి కనిపించారు. ఇలా ముగ్గురు బిడ్డలు ఒకేసారి చనిపోవడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
Read More చావులో సైతం వీడని స్నేహం.. స్నేహితుడి చనిపోయాడని, చితిలో దూకిన వ్యక్తి..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దహనమైన మృతదేహాలను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. వారిది హత్యా... ఆత్మహత్యా... ప్రమాదమా? అన్నది తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.హఫ్నా సోరెన్ మాత్రం తమ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని... అసలేం జరిగిందో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేసాడు.