ముంబయి లోకల్ ట్రైన్లో ప్రమాదకరమైన రీతిలో డోర్లో వేలాడుతూ ప్రయాణించిన ఓ యువకుడిని ట్రైన్ పక్కనే ఉన్న పోల్ గట్టిగా తగిలింది. దీంతో ఆ యువకుడు దారుణంగా గాయపడ్డాడు. ట్రాక్పై పడిపోయాడు.
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో లోకల్ ట్రైన్లు చాలా ఫేమస్. స్థానికులు చాలా మంది లోకల్ ట్రైన్లలోనే ప్రయాణం చేస్తుంటారు. ఈ లోకల్ ట్రైన్లలోనే కొందరు యువకులు ప్రమాదకరమైన రీతిలో ప్రయాణాలు చేస్తుంటారు. వాటిని ప్రమాదకరమైన స్టంట్లుగానూ వర్ణించేట్టుగా ఉంటాయి వారి ప్రయాణాలు. ముంబయి లోకల్ ట్రైన్లలో డోర్లకు వెలాడుతూ యువత ప్రయాణించడం సాధారణంగా మారింది. కొందరైతే.. ట్రైన్ పైకి వెళ్లి స్టంట్లు కూడా వేస్తుంటారు. ఇలాంటి ఓ ప్రమాదకరమైన ఘటన ఒకటి రికార్డ్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఓ యువకుడు వేగంగా వెళ్లుతున్న ఓ లోకల్ ట్రైన్ డోర్లకు వెలాడుతూ వెళ్లుతున్నాడు. ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా ఆ డోర్లో నిలబడి ఉన్నట్టు ఆ వీడియోలో కనిపిస్తున్నది. ఆ ట్రైన్ మూవ్ అవుతుండగానే... డోర్లో నిలబడ్డ మధ్యలో ఉన్న యువకుడు ట్రైన్ పక్కనే ఉన్న ఓ పోల్కు ఢీకొన్నాడు. దీంతో ఆ యువకుడు తనపై నియంత్రణ కోల్పోయాడు. బ్యాలెన్స్ కోల్పోవడంతో ట్రైన్ డోర్ నుంచి నేరుగా పట్టాలపై పడిపోయాడు. ఈ ఘటన కాల్వా, థానే స్టేషన్ల మధ్య జరిగింది. బాధితుడిని దానిష్ జాకిర్ హుస్సేన్ ఖాన్గా గుర్తించారు. కాల్వా మురికివాడకు చెందినవాడిగా తెలిసింది. లేబర్గా పని చేస్తున్నాడు.
దానిష్ జాకిర్ హుస్సేన్ ఖాన్ ప్రమాదవశాత్తు ట్రైన్ నుంచి ట్రాక్పై పడినట్టు ఆయన బంధువులు, ఇతరులు కొందరు ఆయనను కాపాడటానికి పరుగున వెళ్లారు. దానిష్ను కాల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ హాస్పిటల్కు తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఆ యువకుడికి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయినట్టు వివరించారు. అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలకేమీ ముప్పు లేదని తెలిసింది. అయితే, చేతి, కాళ్లకు అయిన గాయాల నుంచి కోలుకుంటున్నట్టు చెప్పారు. థానే రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయింది. నెటిజన్లు ఆ యువకుడిపై విమర్శలు చేశారు. రద్దీగా ఉండే లోకల్ ట్రైన్లో ప్రయాణించడం సవాల్తో కూడుకున్నదేనని పేర్కొన్నారు. కానీ, ప్రమాదకరమైన రీతిలో ప్రయాణించడం ప్రాణాలతో చెలగాటమాడటం వంటిదని వివరించారు.
