మూడో రోజూ అదే తీరు: ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై గురువారం నాటికి మూడు రోజులు అవుతోంది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా అదే సీన్ రిపీటైంది. గురువారం నాడు పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి.బుధవారం నాడు బక్రీద్ కారణంగా పార్లమెంట్ ఉభయ సభలకు సెలవిచ్చారు. ఇవాళ తిరిగి పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి.
పెగాసెస్, నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనతో పాటు ఇతర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.ఈ విషయమై లోక్సభలో విపక్షాలు నిరసనకు దిగాయి. లోక్సభలో వైసీపీ ఎంపీ విపక్షాల నిరసనల మధ్యే కృష్ణా జలాల వివాదాన్ని ప్రస్తావించారు. విపక్ష సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ ఓం బిర్లా పదే పవే కోరారు. కానీ సభ్యులు వినిపించుకోలేదు.
వెల్లో ప్లకార్డులతో విపక్ష సభ్యులు నిరసనకు దిగారు.విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో లోక్సభను స్పీకర్ ఒం బిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడ ఇదే పరిస్థితి నెలకొంది. విపక్ష సభ్యులు తమ డిమాండ్లపై చర్చకు పట్టుబట్టారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు చైర్మెన్ వెంకయ్యనాయుడు.