సమాజాన్ని విభజించి.. అధికారం కోసమే బీజేపీ 'హిందుత్వ'ను ఉపయోగిస్తోంది: అఖిలేష్ యాదవ్
Lucknow: సమాజాన్ని చీల్చడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ 'హిందుత్వ'ను ఉపయోగిస్తోందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ హిందుత్వం సమాజాన్ని చీల్చడమేననీ, నిజమైన హిందువులు నిజమైన హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Samajwadi Party President Akhilesh Yadav: సమాజాన్ని చీల్చి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ తనదైన హిందుత్వ వెర్షన్ ను ఉపయోగిస్తోందనీ, నిజమైన హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తోందని ఆరోపించిన ఆయన.. 2024లో ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారనీ, ఇది రాజ్యాంగాన్ని కాపాడటానికి అవసరమని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో దళిత, అల్ప సంఖ్యాక ప్రజల మద్దతులో 2024లో విచ్ఛిన్నకర బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి భవిష్యత్తు గురించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. "ఎస్పీ ఉంది. బీజేపీ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్న మరిన్ని పార్టీలను స్వాగతిస్తున్నాం. మా పీడీఏ (పిచ్చాడే, దళిత్, అల్పాసంఖ్యక్) ఈసారి బీజేపీని ఓడిస్తుంది. సమాజాన్ని చీల్చడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదు. బీజేపీ కమ్యూనికేషన్ మాధ్యమాన్ని దుర్వినియోగం చేసింది. ప్రతిరోజూ కొత్త అబద్ధాలను సృష్టిస్తోంది. డాక్టర్ భీం రావ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు వారిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.
బీజేపీ హిందుత్వం సమాజాన్ని చీల్చడమేననీ, నిజమైన హిందువులు నిజమైన హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు హిందుత్వాన్ని దుర్వినియోగం చేసిన నకిలీ హిందువుల నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడడం, వివక్షను అంతం చేయడం, ప్రేమను వ్యాప్తి చేయడం, సహనాన్ని పెంచడం నిజమైన హిందుత్వం అని ఆయన అన్నారు. 'గంగా-జమునీ తెహజీబ్' (హిందూ, ముస్లిం సాంస్కృతిక అంశాల సమ్మేళనం), వసుధైవ కుటుంబాన్నిప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేయడమే నిజమైన హిందుత్వ చెబుతోందనీ, నిజమైన హిందుత్వాన్ని వ్యాప్తి చేయాల్సిన బాధ్యత హిందుస్తానీలపై ఉందన్నారు.
బీజేపీ తన రాజకీయ ఎజెండాను సాధించడానికి దేశమంతటా విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించిన అఖిలేష్ యావద్.. సామాజిక సామరస్యానికి బీజేపీ విఘాతం కలిగిస్తోందన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి సమాజాన్ని విడగొట్టడమే బీజేపీ మోడల్ అంటూ విమర్శించారు. శాంతి, అభివృద్ధికి బీజేపీ శత్రువు అన్నారు. బీజేపీ పాలిత మణిపూర్, హర్యానాలు దగ్ధమవుతున్నాయని తెలిపారు. బరేలీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర జరిగిందన్నారు. బీజేపీ అల్లర్లను ప్రోత్సహిస్తోందనీ, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేసే అధికారులను శిక్షిస్తోందని ఆరోపించారు. సీఎం యోగిని టార్గెట్ చేస్తూ.. యూపీలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. రైతులు, సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారాయని తెలిపారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి పతాకస్థాయికి చేరాయనీ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందన్నారు.