Mamata Banerjee On Prophet Row:  పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జ‌రిగిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో హింస చెలరేగింది. ఈ ఘ‌ట‌నపై బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనార్జీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హౌరాలో జరుగుతున్నదాని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. అల్లర్లు జరగాలని ఆ పార్టీలు కోరుకుంటున్నాయని, అటువంటి దానిని తాము సహించబోమని, అలాంటి వారందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు   

Mamata Banerjee On Prophet Row: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన అనుచిత‌ వ్యాఖ్య‌ల వివాదం ముదురుతోంది. ఇప్ప‌టికే  దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. తాజాగా  ప్ర‌వక్త ప్రకటన వివాదంపై పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో శుక్రవారం హింస చెలరేగింది. ప్రజలు పోలీసులపై రాళ్లు రువ్వారు, వాహనాలకు నిప్పు పెట్టారు. హింస చెలరేగడం చూసిన పోలీసులు దుండగులపై లాఠీచార్జి చేశారు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.

మమతా బెనర్జీ ప్రభుత్వం భారీ పోలీసు బలగాలను మోహరించి మొత్తం ప్రాంతాన్ని కంటోన్మెంట్‌గా మార్చింది. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా శనివారం ఉదయం మళ్లీ ఆ ప్రాంతాల్లో రాళ్ల దాడి జరిగింది. ఈ సంద‌ర్బంలో కొంత మంది దుండగులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్త‌తక‌రంగా మారింది.  

ఈ హింసాత్మక సంఘటనల నేపథ్యంలో బెంగాల్ సీఎం మమత బెనర్జీ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ చేసిన పాపానికి తామెందుకు బాధపడాలని ప్రశ్నించారు. మమత బెనర్జీ  త‌న ట్విట్ట‌ర్ లో .. హౌరాలో జ‌రుగుతున్న‌ హింసాత్మక సంఘటనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని, వారు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నార‌ని ఆగ్రహం వ్య‌క్తం చేసింది. అయితే వీటిని సహించేది లేదని అన్నారు. వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బీజేపీని టార్గెట్ చేస్తూనే – బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలని ప్రశ్నించారు. తాను ఈ విషయాన్ని ఇంతకు ముందే చెప్పానన్నారు.

బీజేపీ నేత‌ నూపుర్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆమెను అరెస్టు చేయాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. హౌరాలో జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 

చేతులు జోడించి అభ్యర్థించారు

ఈ క్ర‌మంలో పశ్చిమ బెంగాల్‌లో సామాన్య ప్రజల సౌకర్యార్థం.. రోడ్లు,  రైల్వే ట్రాక్‌లను జామ్ చేయవద్దని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రవక్తకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. 'నేను మీ బాధను, కోపాన్ని అర్థం చేసుకోగలను. అయితే ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగేలా.. రోడ్లు, రైలు మార్గాలకు ఆటంకం క‌లిగించ‌కూడ‌ద‌ని,ఆందోళన చేయవద్దని ముకుళిత హస్తాలతో నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను చంపడం వల్ల నీ కోపం చల్లారితే, నేను దానికి కూడా సిద్ధమే. అని అన్నారు. 

మమత అభ్యర్థన ఫలించలేదు

మ‌మ‌త అభ్య‌ర్థించిన ఫ‌లితం లేకుండా  పోయింది. హింసాత్మక ఆందోళనను కొనసాగించిన ఆందోళనకారులు శనివారం మళ్లీ పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ప‌లుచోట్ల బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. నిరసనల నేపథ్యంలో  పోలీసులు ప‌లు వివాద‌స్ప‌ద ప్రాంతాల్లో 144 సెక్ష‌న్ ను విధించారు. ఉలుబెరియా సబ్ డివిజన్, హౌరా పరిధిలోని జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో 144 సెక్ష‌న్ నిబంధనలు జూన్ 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.  

ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితిని పశ్చిమ బెంగాల్ సీఎం హ్యాండిల్ చేయడం లేదని ప్ర‌తిప‌క్ష‌లు అన్నాయి. మమతా బెనర్జీ కఠినంగా వ్యవహరించే బదులు అక్రమార్కులను అభ్యర్థిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేద‌ని విమ‌ర్శించారు.  

సైన్యాన్ని పిలవండి: బీజేపీ ఎంపీ 

భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి, పార్టీ పశ్చిమ బెంగాల్ ఉపాధ్యక్షుడు సౌమిత్ర ఖాన్ శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు. బెంగాల్ ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, మీరు (అమిత్ షా) వీలైనంత త్వరగా కేంద్ర బలగాలను నియమించి, పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతను కాపాడాల‌ని అన్నారు. తద్వారా పశ్చిమ బెంగాల్ ప్రజలు అణచివేత, నిరంకుశ పాలన నుండి విముక్తి పొందగలరని పేర్కొన్నారు.