బీహార్‌ను డెంగ్యూ వణికిస్తోంది. ఒక్క సెప్టెంబర్‌లోనే 6,146 కేసులు నమోదయ్యాయి. ఇళ్లు, పరిసరాలను పొడిగా, శుభ్రంగా వుంచుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందకుండా చూడాలని అధికారులు సూచిస్తున్నారు. బీహార్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 17 వరకు డెంగ్యూ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

బీహార్‌ను డెంగ్యూ వణికిస్తోంది. అక్కడ ఈ వ్యాధి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. సెప్టెంబర్‌లో 6,146 కేసులు నమోదయ్యాయి. ఇది గత ఐదేళ్లలో ఈ నెలలో నమోదైన కేసుల్లో అత్యధికమని గణాంకాలు చెబుతున్నాయి. బీహార్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 6,421 డెంగ్యూ కేసులు నమోదవ్వగా.. అందులో ఒక్క సెప్టెంబర్‌లోనే 6,146 కేసులు నమోదయ్యాయి. ఇది గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. శుక్రవారం రాష్ట్రంలో 416 కొత్త కేసులు నమోదయ్యాయి. పాట్నాలో అత్యధికంగా 177, ముంగర్‌లో 33, సరన్ 28, భాగల్‌పూర్ 27, బెగుసరాయ్‌లో (17) కేసులు నమోదయ్యాయి. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రకాం.. బీహార్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 17 వరకు డెంగ్యూ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. గతేడాది మొత్తం 13,972 కేసులు నమోదయ్యాయి. భాగల్‌పూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 127 మంది, పావాపురిలోని నిమ్స్‌లో 39 , పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 28 మంది సహా మొత్తం 12 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెప్టెంబర్ 30 నుంచి 295 మంది చికిత్స పొందుతున్నారు. 

బీహార్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ మనోజ్ కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో డెంగ్యూ కేసులు ఎప్పుడూ పెరుగుతాయన్నారు. ఇళ్లు, పరిసరాలను పొడిగా, శుభ్రంగా వుంచుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చన్నారు. దోమలు సంతానాన్ని వృద్ధి చేసుకునే ప్రదేశాలను గుర్తించి వాటిని తక్షణం తొలగించాలని మనోజ్ కుమార్ సూచించారు. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ మాట్లాడుతూ.. కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. స్పేయింగ్, ఫాగింగ్ నిర్వహిస్తున్నామని.. అలాగే దోమల ద్వారా వ్యాప్తిచెందే వ్యాధులపైనా అవగాహనా శిబిరాలు నిర్వహిస్తున్నామని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 

పాట్నా మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ అనిమేష్ కుమార్ పరాశర్ మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న డెంగ్యూ కేసులను తనిఖీ చేయడానికి డ్రైవ్‌ను చేపట్టినట్లు తెలిపారు. 140 వాహనాలు, హ్యాండ్‌హెల్డ్ పరికరాల సాయంతో కెమికల్ ఫాగింగ్ చేస్తున్నామని.. ఇందుకోసం 375 బృందాలను రంగంలోకి దించామని అనిమేష్ కుమార్ తెలిపారు. డెంగ్యూ కేసులు నమోదైన నివాస ప్రాంగణాలను కూడా క్రమం తప్పకుండా శానిటైజ్ చేస్తున్నట్లు కమీషనర్ వెల్లడించారు.