పోర్ట్ఫోలియో మార్పు తర్వాత కొన్ని గంటలకు బీహార్ మంత్రి కార్తికేయ సింగ్ రాజీనామా..
2014కు సంబంధించిన ఒక కేసులో కిడ్నాప్ అభియోగం మోపడంతో దానాపూర్ సబ్డివిజనల్ కోర్టు ఈ కేసులో వారెంట్ జారీ చేయడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. కార్తికేయ సింగ్ను వేరే మంత్రిత్వ శాఖకు మార్చారు. అయితే, పోర్ట్ఫోలియో మార్పు తర్వాత కొన్ని గంటలకు ఆయన రాజీనామా చేశారు.
బీహార్: కిడ్నాప్ కేసులో నిందితుడైన బీహార్ మంత్రి కార్తికేయ సింగ్ రాజీనామా చేశారు. అంతకుముందు రోజు చెరకు పరిశ్రమ మంత్రిగా న్యాయ మంత్రిత్వ శాఖ నుండి బదిలీ చేశారు. పోర్ట్ఫోలియో మార్పు తర్వాత కొన్ని గంటలకు ఆయన రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన రాజీనామాను అంగీకరించి గవర్నర్ ఫాగు చౌహాన్కు పంపినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. 2014 కేసులో కిడ్నాప్ ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు కావడంతో, దానాపూర్ సబ్-డివిజనల్ కోర్టు ఈ కేసులో వారెంట్ జారీ చేయడంతో సీఎం నితీష్ కుమార్.. కార్తికేయ సింగ్ పోర్ట్ఫోలియో ను మార్చారు.
కాగా, బీహార్ లో జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి పార్టీలతో కూడిన మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగస్టు 16న కార్తికేయ సింగ్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆ సమయంలోనే రాజకీయ దుమారం రేగింది. అప్పటికే ఆయనకు వ్యతిరేకంగా దానాపూర్ సబ్-డివిజన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. బీహార్లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సహా అనేక ప్రతిపక్ష పార్టీలు కళంకిత ఎమ్మెల్సీని న్యాయ మంత్రిగా చేసినందుకు జనతాదళ్ యునైటెడ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. కార్తికేయ సింగ్ కోర్టు ముందు లొంగిపోలేదని లేదా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోలేదని కూడా కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. కార్తికేయ సింగ్ చెరకు మంత్రిత్వ శాఖకు మారిన తర్వాత, షమీమ్ అహ్మద్ అతని స్థానంలో కొత్త న్యాయ మంత్రిగా నియమితులయ్యారు. బీహార్ రెవెన్యూ మంత్రి అలోక్ కుమార్ మెహతా చెరకు పరిశ్రమ మంత్రిత్వ శాఖకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఈ నెల ప్రారంభంలో, కార్తికేయ సింగ్ తరపు న్యాయవాది తనపై మోపిన ఆరోపణ నిరాధారమైనదని, అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. "మా క్లయింట్ కార్తికేయ సింగ్కు ఆగస్టు 16 వరకు సబ్-డివిజనల్ కోర్టు నుండి ఎలాంటి వారెంట్ లేదా నోటీసులు అందలేదు. అతను పారిపోయిన వ్యక్తి కాదు. అతను పాట్నా హైకోర్టులో ముందస్తు బెయిల్ను దాఖలు చేశాడు. అది దిగువ కోర్టుకు వెళ్లి అక్కడి దిశానిర్దేశం అనుసరించమని కోరింది" అని కార్తికేయ సింగ్ తరపు న్యాయవాది మధుసూదన్ శర్మ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా ఈ నెల ప్రారంభంలో కార్తికేయ సింగ్ కేసుపై కోర్టు నిర్ణయమే అంతిమమని, దానిని తమ పార్టీ అంగీకరిస్తుందని చెప్పారు.
రాష్ట్ర చెరకు పరిశ్రమల మంత్రిగా న్యాయ మంత్రిత్వ శాఖ నుండి బదిలీ చేయబడిన బీహార్ మంత్రి కార్తికేయ సింగ్ రాజీనామాను బుధవారం ఉదయం బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ ఆమోదించారు. అంతకుముందు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజీనామాను ఆమోదించి గవర్నర్ ఫాగు చౌహాన్కు పంపినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించిన సంగతి తెలిసిందే. కార్తికేయ సింగ్కు వ్యతిరేకంగా వారెంట్ ఉన్నట్లు నివేదికలు వెలువడిన తరువాత, బీహార్ బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు.. నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ మంత్రిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశాయి.