డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లు ఇవాళ సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీష్ కుమార్ , డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఆదివారంనాడు ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు.కర్ణాటక కొత్త సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారోత్సవం పూర్తైన మరునాడే కేజ్రీవాల్ తో నితీష్ కుమార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2024 పార్లమెంట్ ఎన్నికలకు ఏడాది ముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం విపక్షాలకు జోష్ ను నింపింది. బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్యత గల పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు గాను విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ తో సమావేశం నిర్వహించినట్టుగా సమాచారం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో బీహార్ సీఎం నితీష్ కుమార్ నెల రోజుల వ్యవధిలో రెండోసారి సమావేశమయ్యారు. పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ ఆక్రమించుకుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడం ఆప్ తో సంబంధాలు పెంచుకోవడం అవసరమని కాంగ్రెస్ భావిస్తుంది.
విపక్ష పార్టీలతో నితీష్ కుమార్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో నితీష్ కుమార్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.కేజ్రీవాల్ తో సమావేశం ముగిసిన తర్వాత నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తాను ఢిల్లీ ప్రజల తరపున నిలబడుతానని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్రం నడుచుకొనేలా ఒత్తిడి తెస్తామన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే వివాదాస్పద ఆర్డినెన్స్ ను రాజ్యసభలో ఓడించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వాల అధికారాలను తీసివేయడం రాజ్యాంగ విరుద్దమని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.
