బీహార్లోని లఖిసరాయ్ (Lakhisarai) జిల్లాలో సోమవారం ఉదయం బాంబు పేలుడు (bomb blast) సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
బీహార్లోని లఖిసరాయ్ (Lakhisarai) జిల్లాలో సోమవారం ఉదయం బాంబు పేలుడు (bomb blast) సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తక్కువ తీవ్రతో కూడిన పేలుడు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనను లఖిసరాయ్ జిల్లా ఎస్పీ సుశీల్ కుమార్ ధృవీకరించారు. పిపారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని వాలిపూర్ గ్రామంలో ఉదయం 7 గంటల సమయంలో బాంబు పేలుడు సంభవించిందని ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు.
‘బాంబును ప్లాస్టిక్ సంచిలో ఉంచారు.. దానిని లుటన్ రజక్ అనే వ్యక్తికి చెందిన ఇంటి పెరట్లో పెట్టారు. ఆ స్థలంలో ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించిన తర్వాత ఓ మైనర్ బాలుడు దానిని తెలిరిచాడు. ఒకే కుటుంబానికి చెందిన మరో ఆరుగురు వ్యక్తులు అక్కడికి సమీపంలో నిలబడి ఉన్నారు. మైనర్ బాలుడు ప్లాస్టిక్ బ్యాగ్ తెరిచిన వెంటనే పేలుడు సంభవించింది. బాంబు తీవ్రత తక్కువగా ఉంది. మొత్తం ఏడుగురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారికి పిపారియా ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించారు’ అని ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు. బాంబు పేలుడు చోటుచేసుకున్న ప్రాంతంలో మరో మూడు తక్కువ తీవ్రత కలిగిన బాంబులను గుర్తించామని చెప్పారు. గాయపడిన వారి వద్ద నుంచి వాంగ్మూలాలు తీసుకున్నామని చెప్పారు. బాంబు అక్కడకు ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.
