Nupur Sharma: "కొందరు వినాశకరమైన బీజేపీ నాయకుల ఇటీవలి హేయమైన మరియు దారుణమైన ద్వేషపూరిత ప్రసంగ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను.. బీజేపీ తీరుతో హింస వ్యాప్తి చెందడమే కాకుండా దేశ విభజన దారీతీసేలా.. శాంతికి విఘాతం కలిగిస్తుంది" అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.
BJP leaders hate speech: ఇస్లాం స్థాపకుడు మహమ్మాద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, అలాగే, మరో బీజేపీ నాయకుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దేశంలోని ప్రతిపక్షాలు బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాగే, అంతర్జాతీయ సమాజం బీజేపీ నేతల విద్వేష ప్రసంగాలతో పాటు ఏకంగా భారత్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు, ఆరోపణతో విరుచుకుపడుతున్నాయి. ఈ వివాదం ముదురుతున్న వేళ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు.
నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మమతా బెనర్జీ ఖండించారు. మహ్మద్ ప్రవక్తపై వారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నాయకులిద్దరిని అరెస్టు చేయాలని మమతా బెనర్జీ అన్నారు. "కొందరు వినాశకరమైన బీజేపీ నాయకుల ఇటీవలి హేయమైన మరియు దారుణమైన ద్వేషపూరిత ప్రసంగ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను.. బీజేపీ తీరుతో హింస వ్యాప్తి చెందడమే కాకుండా దేశ విభజన దారీతీసేలా.. శాంతికి విఘాతం కలిగిస్తుంది" అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. "దేశ సమైక్యతకు భంగం కలగకుండా, ప్రజలు మానసిక వేదనకు గురికాకుండా ఉండేందుకు బీజేపీకి చెందిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని నేను గట్టిగా కోరుతున్నాను" అని మమత పేర్కొన్నారు.
అలాగే, ప్రజలు శాంతిభద్రతలు కాపాడేలా నడుచుకోవాలని ఆమె కోరారు. "అదే సమయంలో, మేము రెచ్చగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ, సామాన్య ప్రజల పెద్ద ప్రయోజనాల కోసం శాంతిని కాపాడాలని అన్ని కులాలు, మతాలు, మతాల-వర్గాలకు చెందిన అందరూ నా సోదరులు మరియు సోదరీమణులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని మమతా బెనర్జీ వెల్లడించారు.
కాగా, బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కొన్ని ముస్లిం దేశాలు తమ నిరసనను తెలియజేసేందుకు భారత రాయబార కార్యాలయినికి అధికారులను సైతం పంపాయి. పలు దేశాల్లో భారత వస్తువుల అమ్మకాలపై నిషేధం కొనసాగుతోంది. ఈ విషయంలో బీజేపీ, భారత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని గల్స్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదం నేపథ్యంలోనే బీజేపీ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇరువురు నేతలను సస్సెండ్ చేసింది. అయితే, ఈ వ్యాఖ్యలు ఏ ప్రభుత్వ కార్యకర్త చేయలేదని, ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపలేదని కేంద్రం పేర్కొంది. కాగా, ఢిల్లీ పోలీసులు గురువారం నాడు నూపుర్ శర్మపై కేసు నమోదుచేశారు. హైదరాబాద్ లోనూ ఆమెపై కేసు నమోదైంది.