ట్రక్లో మ్యారేజ్ హాల్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా (వీడియో)
ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికర వీడియో ట్వీట్ చేశారు. ట్రక్ పై ప్రయాణించే మొబైల్ మ్యారేజ్ హాల్ వీడియోను ఆయన షేర్ చేసి.. ఆ ఆలోచనతో ఇంప్రెస్ అయ్యారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికర వీడియోను పోస్టు చేశారు. ఇటీవలే ఆయన కదులుతున్న డైనింగ్ టేబుల్ వీడియోను పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అందులో నలుగురు యువకులు డైనింగ్ టేబుల్ వంటి వాహనం పై కూర్చున్నారు. వారు తింటూ ఉండగానే ఆ డైనింగ్ టేబుల్ వెహికల్ ఫ్యూయల్ స్టేషన్ వెళ్లుతుంది. అక్కడ ఫ్యూయల్ నింపుకుని మళ్లీ మూవ్ అయి వెళ్లిపోతుంది. తాజాగా, ఇలాంటి ఓ మొబైల్ వెరైటీనే ట్విట్టర్లో షేర్ చేశారు.
ఓ వినూత్న రీతిలో ఉన్న.. సృజనాత్మకంగా రూపొందించిన మ్యారేజ్ హాల్ను ప్రదర్శిస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. ఆ మ్యారేజ్ హాల్ ఎక్కడికి అయినా సరే తరలించే రకంగా ఉన్నది. వాహనాలను తీసుకెళ్లే పెద్ద ట్రక్ను క్రియేటివ్గా ఆలోచించి మ్యారేజ్ హాల్గా చేశారు. అది సుమారు 200 మంది అతిథులకు సరిపడా వివాహ వేదికకు సిద్ధం అయింది. 40*30 చదరపు అడుగుల విశాలమైన పోర్టేబుల్ మ్యారేజ్ హాల్ ఏర్పడింది. అంతేకాదు, ఈ మ్యారేజ్ హాల్ సరికొత్త డిజైన్లు.. లగ్జరీగా కనిపిస్తున్నది.
రోడ్డు పై ప్రయాణిస్తున్న ట్రక్ ఆ వీడియోలో కనిపించింది. నెక్స్ట్ సీన్లోనే ఆ ట్రక్ మ్యారేజ్ హాల్గా రూపాంతరం చెందే విధం ఉన్నది. విశాలమైన మ్యారేజ్ హాల్గా ఆ ట్రక్ మారిపోయింది.
ఈ మొబైల్ మ్యారేజ్ హాల్ క్రియేటర్ ఆలోచనను ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. ఆ క్రియేటర్ను కలువాలని కూడా కోరుకుంటున్నట్టు వివరించారు. ఇది ఎక్కడికి అయినా తీసుకెళ్లే మ్యారేజ్ హాల్ మాత్రమే కాదని, పర్యావరణ హితమైన సెటప్ అని తెలిపారు. దేశంలో రద్దీ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, మ్యారేజ్ హాల్ అందుబాటులో లేని లేదా నిర్మించడం సాధ్యపడని ప్రాంతాల్లోకి దీన్ని సులువుగా తీసుకెళ్లి వినియోగించుకోవచ్చని ట్విట్టర్ యూజర్లు అభిప్రాయపడ్డారు.