UP Polls : బీజేపీలోకి మా సిద్ధాంతాలను మోసుకెళ్తారు: అపర్ణా యాదవ్ పార్టీని వీడటంపై అఖిలేశ్ స్పందన
ఉత్తరప్రదేశ్ ఎన్నికల (up elections) వేళ.. సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (akhilesh yadav) దగ్గరి బంధువు అపర్ణా యాదవ్ (aparna yadav) బీజేపీలో చేరడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై అఖిలేశ్ స్పందించారు. ఆమె తమ సిద్ధాంతాలను బీజేపీకి తీసుకెళ్తారని ఆయన ఆకాంక్షించారు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల (up elections) వేళ.. సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (akhilesh yadav) దగ్గరి బంధువు అపర్ణా యాదవ్ (aparna yadav) బీజేపీలో చేరడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై అఖిలేశ్ స్పందించారు. ఆమె తమ సిద్ధాంతాలను బీజేపీకి తీసుకెళ్తారని ఆయన ఆకాంక్షించారు. అపర్ణను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. తాము టిక్కెట్లు ఇవ్వలేని వారికి కూడా టిక్కెట్లు ఇస్తున్నందుకు ధన్యవాదాలంటూ అఖిలేశ్ సెటైర్లు వేశారు.
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (mulayam singh yadav) చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్యే అపర్ణా యాదవ్. 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రీటా బహుగుణ చేతిలో ఓటమి పాలైంది. అయితే సమాజ్వాదీ పార్టీని వీడేముందు ఆమె తన తండ్రి ములాయంతో మాట్లాడేందుకు ప్రయత్నించారని అఖిలేశ్ తెలిపారు. అపర్ణా యాదవ్ను బుజ్జగించేందుకు ములాయం శాయశక్తులా ప్రయత్నించారని.. అయితే టికెట్లు తమ అంతర్గత సర్వేలపై ఆధారపడి వుంటాయని అఖిలేశ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించినందునే అపర్ణా యాదవ్ సమాజ్వాదీ పార్టీని వీడారని ఆయన అన్నారు. గత వారం అఖిలేశ్ యాదవ్ పార్టీలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు సహా పలువురు కీలక నేతలు చేరడంతో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన బీజేపీకి.. అపర్ణా యాదవ్ రాక పెద్ద ఊరట.
కాగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో పనిచేసిన ముగ్గురు మంత్రులు ఇటీవలనే బీజేపీకి గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ ముగ్గురు కూడా బీజేపీని వీడిన తర్వాత ఆ పార్టీపై. యూపీ సీఎం యోగిపై తీవ్ర విమర్శలు చేశారు.2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న యూపీ ఎన్నికల్లో ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ కు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న మమత బెనర్జీ, ఎన్సీపీ లు కూడా మద్దతును ఇచ్చాయి.
యోగి కేబినెట్ నుండి స్వామి ప్రసాద్ మౌర్య, ధరం సింగ్ సైనీ,, ధారాసింగ్ చౌహన్ లు ఇటీవలనే బయటకు వచ్చారు. బీజేపీకి గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అంతేకాదు కొందరు ఎమ్మెల్యేలు కూడా ఎస్పీలో చేరారు. 2017 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ టికెట్ పై అపర్ణ యాదవ్ లక్నో కాంట్ నుండి పోటీ చేశారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన రీటా బహుగుణ జోషి తర్వాతి స్థానంలో అపర్ణ యాదవ్ నిలిచారు. మహిళల సమస్యల కోసం, ఆవులకు ఆశ్రయం కోసం పనిచేసే బావేర్ అనే సంస్థను అపర్ణ యాదవ్ నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ఆమె ప్రశంసించి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
బీజేపీలో చేరిన తర్వాత తాను ఎప్పుడూ కూడా నరేంద్ర మోడీ నుండి స్పూర్తి పొందుతానని అపర్ణ యాదవ్ తెలిపారు. బీజేపీ చేపడుతున్న పథకాలు తనను ఎప్పుడూ కూడా ఆకర్షిస్తున్నాయని ఆమె తెలిపారు. అపర్ణ యాదవ్ బీజేపీలో చేరిన సమయంలో ఆమె వెంటే యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య కూడా ఉన్నారు. బీజేపీలోకి అపర్ణ యాదవ్ కి స్వాగతం పలుకుతున్నట్టుగా కేశవ్ మౌర్య చెప్పారుు. కుటుంబంతో పాటు రాజకీయాల్లో కూడా అఖిలేష్ యాదవ్ విజయవంతం కాలేరని తాను చెప్పాలనుకొంటున్నానని మౌర్య సెటైర్లు వేశారు.
చాలా రోజులుగా జరిగిన చర్చల ఫలితంగానే అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అపర్ణ యాదవ్ బీజేపీలో చేరడాన్ని స్వాగతించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు. మహిళల భద్రత, సాధికారిత, గూండారాజ్ పై దాడి,పేదల సంక్షేమం కోసం చేస్తున్న మీ కృషి అభినందనీయమని కేంద్ర మంత్రి ఠాగూర్ చెప్పారు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుండి మార్చి 7వ తేదీ వరకు ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది.