Adhir Ranjan Chowdhury Remark: భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముపై తాను చేసిన వ్యాఖ్యల ప‌ట్ల‌ విచారం వ్య‌క్తం చేస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌధరి అన్నారు. కానీ.. ఈ వివాదంలోకి సోనియా గాంధీని ఎందుకు లాగుతున్నార‌ని బీజేపీ నాయ‌కులను ప్రశ్నించారు.  

Adhir Ranjan Chowdhury Remark: భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ చేసిన వ్యాఖ్య‌లు వ‌ల్ల‌ ఇవాళ పార్ల‌మెంట్‌లో తీవ్ర దుమారం రేగింది. ఆయ‌న‌ చేసిన కామెంట్స్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి స్పందించారు. 

రాష్ట్ర‌ప‌తిపై తాను చేసిన వ్యాఖ్యపై దుమారం రేగడంతో తాను ఆమెను వ్యక్తిగతంగా కలుస్తానని, ఆమెకు క్షమాపణలు చెబుతానని అన్నారు. తాను ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అయితే.. సోనియా గాంధీని ఈ వివాదంలోకి ఎందుకు లాగుతున్నార‌ని బీజేపీ నాయ‌కులను ప్రశ్నించారు. ఈ మొత్తం ఘటనను బీజేపీ గాలికొదిలేసిందని, మాట తప్పడం వల్లే తన వ్యాఖ్య జరిగిందని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.  తాను పొర‌పాటుగా అలాంటి వ్యాఖ్య‌లు చేశాన‌ని, రాష్ట్ర‌ప‌తిని అవ‌మానించాల‌ని త‌న‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

కాగా అంత‌కుముందు  కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి .. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని 'రాష్ట్రపత్ని' అని సంభోదించారు. దీంతో విప‌క్ష‌లు మండిప‌డ్డాయి.  ఆయన చేసిన వ్యాఖ్యలకు వ్య‌తిరేకంగా బీజేపీ ఎంపీలు గురువారం పార్లమెంటులో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. చౌదరి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని  బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.

బీజేపీ నేతల వ్యాఖ్య‌ల‌పై సోనియా గాంధీ స్పందిస్తూ..  అధిర్ రంజన్ చౌదరి .. తన వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణలు చెప్పారని అన్నారు. గురువారానికి లోక్‌సభ వాయిదా పడిన తర్వాత 'తనతో మాట్లాడవద్దని' సోనియా స్మృతి ఇరానీకి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అధిర్ రంజాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర‌ప‌తిని అవమానించిందని అన్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో మహిళను ఆదివాసీ విరోధి కాంగ్రెస్.. మహిళా విరోధి కాంగ్రెస్.. గరీబ్ విరోధి కాంగ్రెస్.. తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. భారత తొలి మహిళా గిరిజన అధ్యక్షురాలిని అవమానించినందుకు సోనియా గాంధీ దేశానికి, గిరిజనులకు క్షమాపణ చెప్పాలని, సోనియా గాంధీ కూడా కావాలనే ద్రౌపది ముర్ము అవమానించార‌ని  లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ద్రౌపది ముర్మును తమ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆమెను తీవ్రంగా అమానించారని, కాంగ్రెస్ నాయకులు ఆమెను తోలుబొమ్మ,  చెడుకు చిహ్నం అని  కామెంట్ చేస్తున్నారని అన్నారు.

మ‌రోవైపు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వయంగా వారి పార్టీ నేత అలా మాట్లాడటానికి అనుమతించార‌నీ, వారు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ స్పందించారు. ఆమెను మీడియా ప్ర‌శ్నించ‌గా.. అధిర్ ఎప్పుడో క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని సోనియా అన్నారు. 

ఈ వ్యాఖ్యలపై అధికార బీజేపీ పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార పక్షం చేసిన పెద్దఎత్తున నినాదాలు, నినాదాలతో లోక్‌సభ వాయిదా పడింది. చ‌ర్చ‌ల నుంచి విప‌క్షాలు దూరంగా ఉండాల‌ని భావిస్తున్నాయ‌ని, చ‌ర్చ‌లో పాల్గొనేందుకు మంత్రి సీతారామ‌న్ స‌భ‌కు వ‌చ్చిన‌ట్లు మంత్రి ప్ర‌హ్లాద్ జోషి వెల్ల‌డించారు.