ముంబైలో దారుణం... లైంగిక దాడి బాధితురాలిపైనే నిందితుడి యాసిడ్ దాడి
లైంగిక దాడి చేసినవాడే బాధిత యువతిపై యాసిడ్ దాడి చేసిన దారుణం మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.
ముంబై: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా... పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు. అమ్మాయి కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడి యువతి జీవితాన్ని నాశనం చేయడమే కాదు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఓ యువతిపై కామాంధుడు ఇటీవల బలత్కారానికి ఒడిగట్టాడు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి యువతి పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
read more అప్పుల బాధ.. పిల్లలకు విషమిచ్చి చంపి, తామూ ఆత్మహత్య చేసుకున్న దంపతులు...
అయితే తనపై లైంగిక దాడి కేసు పెట్టిన యువతిపై నిందితుడు కోపాన్ని పెంచుకున్నాడు. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న అతడు దారుణానికి ఒడిగట్టాడు. ఓ బెలూన్ లో యాసిడ్ ను నింపి అంధేరి-ఘట్కోపర్ లింక్రోడ్లోని బిస్లరి జంక్షన్ వద్ద యువతిపై దాడి చేశాడు. అయితే బెలూన్ యువతి శరీరంపై కాకుండా కిందపడ్డాక పగిలింది. దీంతో యువతి కాలిపై యాసిడ్ పడి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ దాడిలో గాయపడ్డ యువతిని పోలీసులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స అనంతరం బాధిత మహిళ అందేరీ పోలీస్ స్టేషన్ లో తనపై జరిగిన యాసిడ్ దాడిపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.