Asianet News TeluguAsianet News Telugu

ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే : ఐదు రాష్ట్రాల్లో నాలుగు బీజేపీవే, పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఆశలు గల్లంతు

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జనం నాడిపై ఏబీపీ సీఓటర్‌ సర్వే నిర్వహించింది. ఇందులో యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోన్నుట్లు సర్వేలో వెల్లడించింది. పంజాబ్‌లో అధికారంలో వున్న కాంగ్రెస్‌కు షాక్ తగిలే అవకాశం వుందని సర్వేలో తేలింది. ఇక్కడ అప్ అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని అందుకోనుందని సర్వేలో తెలిపింది.

ABP Cvoter Survey BJP Likely To Retain Power In Uttarakhand Goa Manipur UP
Author
New Delhi, First Published Sep 3, 2021, 9:20 PM IST

మోడీ ప్రభ నానాటికీ మసకబారుతుండటం, కాంగ్రెస్ చుట్టూ విపక్షాలు చేరుతుండటం, ప్రశాంత్ కిశోర్ కొత్త ఎత్తుగడల నేపథ్యంలో దేశంలో త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ పరిస్థితి ఏంటీ..? కాంగ్రెస్ సత్తా చాటుతుందా అంటూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనం నాడిపై ఏబీపీ సీఓటర్‌ సర్వే నిర్వహించింది. ఇందులో యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోన్నుట్లు సర్వేలో వెల్లడించింది.

పంజాబ్: 
పంజాబ్‌లో అధికారంలో వున్న కాంగ్రెస్‌కు షాక్ తగిలే అవకాశం వుందని సర్వేలో తేలింది. కాంగ్రెస్, బీజేపీ, అకాలీలను కాదని అతిపెద్ద పార్టీగా ఆప్‌ అవతరించనున్నట్లు ఏబీపీ సీఓటర్‌ సర్వే పేర్కొంది. పంజాబ్‌లో 31.5 ఓట్‌ షేర్‌తో ఆప్‌ 55 సీట్లు సాధిస్తుందని సర్వే తెలిపింది. ఇక రెండో స్థానంలో వున్న కాంగ్రెస్‌ 37 సీట్లకు పరిమితమవుతుందని ఏబీపీ సీఓటర్‌ సర్వేలో స్పష్టం చేసింది. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తప్పదనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఉత్తరప్రదేశ్:
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కాస్త బలం తగ్గినా తిరిగి అధికారం దక్కించుకుంటుందని సర్వే తెలిపింది. బీజేపీ సుమారు 60 సీట్లను యూపీలో కోల్పోయినా  అధికారానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని పేర్కొంది. ఇక్కడ బీజేపీ 259 నుంచి 267నుంచి గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ 109 నుంచి 117 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. ఇక మాయావతి బీఎస్పీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని తెలిపిన సర్వే.. కాంగ్రెస్‌ 3 నుంచి 7 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే నిర‍్వహించిన సర్వేలో 44 శాతం మంది సీఎం యోగి నాయకత్వం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది.

గోవా:

కేంద్ర పాలిత రాష్ట్రం గోవాలో కూడా బీజేపీయే తిరిగి అధికారంలోకి రానున్నట్లు సర్వే తెలిపింది. ఇక్కడ కమలనాథులు 39. 4 ఓట్ల శాతంతో అధికారాన్ని నిలబెట్టుకుంటారని, అదే సమయంలో ఆప్‌ 22.2 ఓట్ల శాతాన్ని సాధిస్తుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్‌ 15.4 శాతానికి పరిమితం కానుందని తెలిపింది. బీజేపీకి 22 నుంచి 26 సీట్లు, ఆప్‌కు 4 నుంచి 8 సీట్లు, కాంగ్రెస్‌ 3 నుంచి 7 సీట్లకు పరిమితం కానుందని వెల్లడించింది.

మణిపూర్:

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో సైతం బీజేపీనే ఆధిక్యంలో నిలిచి అధికారం దక్కించుకుంటుందని ఏబీపీ సర్వేలో తెలిపింది. ఇక్కడ బీజేపీ 40.5 ఓట్ల శాతంతో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంటుందని తెలిపిన సర్వే.. కాంగ్రెస్‌ 34.5 శాతంలో రెండో స్థానానికి పరిమితం కానుందని స్పష్టం చేసింది. ఇక్కడ బీజేపీకి 32 నుంచి 36 సీట్లు, కాంగ్రెస్‌‌కు 18 నుంచి 22 సీట్లు వస్తాయని పేర్కొంది.

ఉత్తరాఖండ్:

70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని కూటమి  46 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్‌ 21 సీట్లు గెలుస్తుంది ఏబీపీ-సీఓటర్‌ తన సర్వేలో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న సీట్లలో బీజేపీ 11 కోల్పోయే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది.

Follow Us:
Download App:
  • android
  • ios