బెంగాల్ రాష్ట్రంలోని బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు మూడు బాంబులు విసిరారు. అయితే ఈ దాడి టీఎంసీ పనేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను టీఎంసీ తిప్పికొట్టింది. బీజేపీ నేతల మధ్య విబేధాల కారణంగానే ఈ దాడి జరిగిందని టీఎంసీ ఎదురుదాడికి దిగింది.


కోల్‌కత్తా:పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కత్తాలో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటికి సమీపంలో మూడు బాంబులను గుర్తు తెలియని వ్యక్తులు వేశారు. ఈ బాంబుల దాడికి టీఎంసీయే కారణమని బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు.

బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇల్లు కోల్‌కత్తాకు 100 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఇంటిపై ఇవాళ ఉదయం బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు బాంబులు వేశారు. ఎంపీ ఇంటి గేటుపై పేలుడు పదార్ధాలను గుర్తు తెలియని వ్యక్తులు ఉంచినట్టుగా సీసీటీవీ వీడియో దృశ్యాల్లో కన్పించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న అర్జున్ సింగ్ కోల్‌కత్తాకు వెళ్లాడు.ఈ విషయమై గవర్నర్ జగదీష్ ధన్‌కర్ బెంగాల్‌ లో నిరంతరం హింస సాగుతుందన్నారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హింస తగ్గుముఖం పట్టలేదు. ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వెలుపల బాంబుదాడి ఘటన శాంతిభద్రతలపై ఆందోళన కల్గిస్తోందని ఆయన చెప్పారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఆయన బెంగాల్ పోలీసులతో పాటు సీఎం మమత బెనర్జీకి కూడ ఆయన ట్యాగ్ చేశారు.మరోవైపు బీజేపీలోని బెంగాల్ నేతల మధ్య విబేధాల కారణంగానే బాంబు దాడి జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.