ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు.. గోడకూలి 10మంది దుర్మరణం..
రెండు వేర్వేరు చోట్ల గోడలు కూలిన ఘటనలో మొత్తం పదిమంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ప్రమాదం సంభవించింది.
లక్నో : భారీ వర్షాలు, వరదలు ఉత్తరప్రదేశ్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఇటావా జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో గోడలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇటావాతోపాటు ఫిరోజాబాద్, బలరాంపూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.
ఇటావా చందపుర ప్రాంతంలో ఇంటి గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందగా.. కృపాల్ ప్రాంతంలో పెట్రోల్ పంపు ప్రహరీ గోడ కూలి గుడిసెపై పడగా వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో అందవా కే బంగ్లా ప్రాంతంలో ఇంటి గోడ కూలిపోయి 35 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇటావా గ్రామంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరికొన్ని రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.