బీహార్ లో అసదుద్దీన్ ఎంఐఎం బోణీ: కేంద్ర మంత్రి గిరిరాజ్ తీవ్ర వ్యాఖ్యలు
అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని ఎంఐఎం కిషన్ గంజ్ సీటును గెలుచుకోవడం ద్వారా బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దానిపై కేంద్ర మంత్రి, బిజెపి నేత గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పాట్నా: బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కిషన్ గంజ్ సీటును అసదుద్దీన్ నాయకత్వంలోని మజ్లీస్ గెలుచుకోవడంపై కేంద్ర మంత్రి, బీజెపీ నేత గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ విజయం జిన్నా సిద్ధాంతం విజయమని ఆయన అన్నారు. అది దేశ సమగ్రతకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని ఆయన శుక్రవారం అన్నారు.
అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కిషన్ గంజ్ సీటును గెలుచుకుని శాసనసభలో తన ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. బీహార్ ఉప ఎన్నికల్లో కిషన్ గంజ్ లో అతి ప్రమాదకరమైన తీర్పు వెలువడిందని ఆయన అన్నారు.
Also Read: బీహార్ లో ఎంఐఎం బోణీ
ఓవైసీ పార్టీ ఎఐఎంఐఎం జిన్నా సిద్ధాంతం ఆలోచనా సరళికి చెందిందని ఆయన అన్నారు. వారు వందే మాతరం గీతాన్ని ద్వేషిస్తారని ఆయన అన్నారు. బీహార్ సామాజిక సమగ్రతకు అది భంగకరమని ఆయన అన్నారు.
బీహార్ ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. మజ్లీస్ అభ్యర్థి కుమరుల్ హోడా బిజెపి అభ్యర్థి స్వీటీ సింగ్ ను 10 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించింది.