నా సోదరిని కిడ్నాప్ చేసి, చిత్ర హింసలు..చైనా పై సంచలన ఆరోపణలు
మానవ హక్కుల కోసం తాను గళమెత్తి ప్రశ్నించినందుకు ప్రతీకారంగా డ్రాగన్ దేశం ఈ అరాచకానికి పూనుకుందన్నారు. తన మతానికి చెందిన వారిపై చైనా దుర్మార్గానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన సోదరిని చైనాలో నిర్భందించారని అమెరికా సామాజికవేత్త రుషాన్ అబ్డాస్ ఆరోపించారు. మైనార్టీలను చైనాలో చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇటీవల ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చైనా పై సంచలన ఆరోపణలు చేశారు.
2018లో సెప్టెంబర్ 28న తన సోదరి, మెడికల్ డాక్టర్ గుల్షాన అబ్బాస్ను చైనా ప్రభుత్వం కిడ్నాప్ చేసిందని, ఇప్పటివరకు తన గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. అయితే దీనికి గల కారణం కూడా తెలీదని, కనీసం తనపై ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.
తన స్నేహితురాళ్లను సైతం కాన్సంట్రేషన్ క్యాంపులో నిర్బంధించిందని ఆరోపించారు. చైనాలో అడుగంటిపోతున్న మానవ హక్కుల కోసం తాను గళమెత్తి ప్రశ్నించినందుకు ప్రతీకారంగా డ్రాగన్ దేశం ఈ అరాచకానికి పూనుకుందన్నారు. తన మతానికి చెందిన వారిపై చైనా దుర్మార్గానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
"1949లో మా భూమిని ఆక్రమించినప్పటినుంచి కమ్యూనిస్ట్ చైనా వివిధ సాకులను చూపుతూ ఉఘర్ ముస్లింలను టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు అది తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్కడి అధికారులు వారిని శారీరకంగానూ, మానసికంగానూ చిత్రహింసలు పెడుతారు. సరైన తిండీ, నీళ్లు ఇవ్వరు. సరిగా నిద్ర కూడా పోనివ్వరు. ఈ శిబిరాల నుంచి బయటకు వచ్చే చాలా మంది మహిళలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) చేస్తారు. ఇప్పటికీ అక్కడి రహస్య క్యాంపుల్లో 3 మిలియన్ల మంది ఉఘర్ మహిళలు మగ్గిపోతున్నారు. ఆ దేశ ఎకానమీ కోసం వీరిని కట్టుబానిసలుగా వినియోగించుకుంటున్నారు" అని రుషాన్ పేర్కొన్నారు.