అమెరికాకు సునామీ వార్నింగ్.. పసిఫిక్లో బద్ధలైన అగ్నిపర్వతం.. అక్కడ నాలుగు అడుగుల ఎత్తుకు అలలు
పసిఫిక్ మహాసముద్రంలోని ఓ అగ్నిపర్వతం పేలింది. దీంతో సముద్రంలో భారీ ఎత్తుతో అలలు ఎగసిడుతున్నాయి. ఇవి సమీపంలోని తీర దేశాలకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా పలు దేశాలు సునామీ అలర్ట్ జారీ చేశాయి. అమెరికా రాష్ట్ర హవాయ్కు చెందిన కొన్ని దీవుల్లో ఇప్పటికే వరదలు వచ్చాయి. పసిఫిక్ మహాసముద్రంలోని దీవి దేశం టోంగా సమీపంలో ఈ అగ్ని పర్వతం బద్ధలైంది. టోంగాలో నాలుగు అడుగుల ఎత్తుతో అలలు రావడాన్ని అధికారులు గుర్తించారు.
న్యూఢిల్లీ: పసిఫిక్ మహాసముద్రంలో అగ్నిపర్వంత బద్ధలైంది. దీంతో సముద్ర అలలు చాలా ఎత్తుతో ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అగ్నిపర్వతం సమీప దేశాలు సునామీ అలర్ట్ జారీ చేశాయి. అమెరికాలోనూ సునామీ వార్నింగ్ జారీ చేశారు. ఆ దేశ రాష్ట్రం హవాయ్లో ఇప్పటికే వరదలు వచ్చాయి. పసిఫిక్ సముద్రంలోని దీవి దేశం టోంగా సమీపంలో టోంగా హుంగా హాపాయ్ అగ్ని పర్వతం బద్ధలైంది. దాని నుంచి బూడిద, లావా ఎగసిపడ్డాయి. దాని నుంచి పొగ కొన్ని కిలోమీటర్ల మేర ఆకాశంలోకి ఆవృతమైంది. ఈ దేశానికి సమీపంలోని.. లేదా ఈ అగ్నిపర్వతం పేలుడుతో ప్రభావితమయ్యే ప్రమాదం ఉన్న దేశాలు జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫిజి,వనౌతు, చిలీ, అమెరికాలోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈ అగ్నిపర్వతం సుమారు ఎనిమిది నిమిషాలపాటు లావాను ఎగజిమ్మింది. ఈ పర్వతం పేలుడుతో సముద్రం అల్లకల్లోలానికి గురైంది. అత్యంత ఎత్తుతో అలలు వేగంగా ప్రవహిస్తున్నాయి. సుమారు లక్ష మందికి ఆవాసమైన టోంగాలోనైతే భయాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ దేశ రాజధాని తీరం వద్ద నాలుగు అడుగుల ఎత్తులో అలలు వచ్చాయి. దీంతో ప్రజలంతా ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారు. అగ్నిపర్వతం దెబ్బతో కొన్ని గంటల పాటు ఈ దేశం నుంచి ఇతర దేశాలకు కమ్యూనికేషన్ నిలిచిపోయింది. అయితే, ఈ దేశంలో ప్రాణ నష్టమేమీ జరగలేదని తెలిసింది.
కాగా, అమెరికాలో సునామీ వార్నింగ్ జారీ అయింది .యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ సునామీ అడ్వైజరీ విడుదల చేసింది. కాలిఫోర్నియా నుంచి అలస్కా వరకు సముద్ర అలలు రెండు అడుగుల ఎత్తుతో రావచ్చని హెచ్చరించింది. పసిఫిక్ తీర ప్రాంతాలకు ప్రత్యేక అలర్ట్ జారీ చేసింది. వెంటనే బీచ్లు, హార్బర్లు, మెరీనాస్ నుంచి ప్రజలు వెనక్కి రావాలని సూచనలు చేసింది. హవాయ్ రాష్ట్రంలో ఇప్పటికే సునామీని చూస్తున్నామని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. హవాయ్ రాష్ట్రానికి చెందిన కొన్ని దీవుల్లో వరదలు వచ్చాయని, కానీ, పెద్ద మొత్తంలో నష్టమేమీ జరగలేదని వివరించింది.
ఇటీవలే ఇండోనేషియాలోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్కడ భూకంపం సంభవించిన తర్వాత ఈ వార్నింగ్ ఇష్యూ చేవారు. తూర్పు ఇండోనేషియాలో (Indonesia) రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మౌమెరే (Maumere) పట్టణానికి ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో.. ఫ్లోర్స్ సముద్రంలో (Flores Sea) 18.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టుగా పేర్కొంది. భారీ భూకంపం చోటుచేసుకున్న నేపథ్యంలో ఇండోనేషియా వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (Pacific Tsunami Warning Center) ఇలాంటి హెచ్చరికలే జారీచేసింది. భూకంప కేంద్రం నుంచి 1,000 కి.మీ లోపు తీర ప్రాంతాల్లో ప్రమాదకర అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది.
ఇక, 2004లో ఇండోనేషియాలో చివరిసారిగా సునామీ సంభవించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 26న వాయువ్య సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభించింది. ఆ తర్వాత సునామీ రావడంతో.. ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్లాండ్తో పాటు మరో తొమ్మిది దేశాలకు చెందిన 2,20,000 మంది చనిపోయారు. ఇందులో ఇండోనేషియా ప్రజలే 1,70,000 ఉన్నారు.