Asianet News TeluguAsianet News Telugu

ఎన్నారై మీట్ లో మోడీతో ట్రంప్: వ్యూహం ఇదే...

హూస్టన్ లో జరిగే హౌడీ మోడీ ఎన్నారై మీట్ కు డోనాల్డ్ ట్రంప్ హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడం వెనక పెద్ద ఎత్తగుడనే ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ ఆ అవకాశాన్నా వాడుకోవాలని చూస్తున్నారు.

The idea behind Trump's presence at Howdy Mody
Author
Houston, First Published Sep 16, 2019, 1:18 PM IST

ఈ నెల 22వ తేదీన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో మన ప్రధాని నరేంద్రమోడీ పాల్గొననున్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా 50వేల మంది భారతీయ అమెరికన్లు ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ గత రెండు పర్యాయాల సభల కన్నా ఇది చాలా పెద్దది. 

నిన్న ఆదివారం నాడు వైట్ హౌస్ ఒక ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సభకు హాజరవ్వనున్నట్టు తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ట్విట్టర్లో ఈ పరిణామాన్ని స్వాగతించాడు. ఇంత భారీ సంఖ్యలో  భారతీయ అమెరికన్లను ఒకే చోట ఉద్దేశించి ప్రసంగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెకార్డులకెక్కనున్నాడు. 

కాశ్మీర్ విషయంలో ప్రపంచమంతా భారత దేశానికి మద్దతు పలుకుతుందని మరోమారు ఈ సభ ద్వారా చాటిచెప్పే ఛాన్స్ కూడా మనకు దక్కింది. పైకి చూడడానికి స్నేహహస్తం అందించడానికి ట్రంప్ ఈ సభకు వస్తున్నాడు అని మనకు అనిపించవచ్చు. కానీ ఇందులో ఒక పెద్ద మతలబు దాగిఉంది. 

కొన్ని రోజుల కింద గనుక మనము చూస్తే, డెమొక్రాట్ల తరుఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడటానికి ప్రిలిమినరీల్లో పాల్గొంటున్న బెర్నీ సాండర్స్ కాశ్మీర్ విషయంలో భారత వైఖరిని తప్పుపట్టాడు. అతను ఇలా మాట్లాడడానికి కారణం అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు ఉండడం. అమెరికాలో ముస్లిం శరణార్థులు భారీ సంఖ్యలో ఉన్నారు. వారిలో ఇల్హన్ ఒమర్ వంటివారు అమెరికా కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. సాధారణ అమెరికన్లు వీరిని శరణార్థులుగా పరిగణిస్తూ వీరిపట్ల ఒకింత జాలి చూపెడుతుంటారు. ఇప్పుడు ట్రంప్ రైట్ వింగ్ పాలిటిక్స్ అధికంగా చేస్తున్నాడు కాబట్టి డెమొక్రాట్లంతా లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ వైపుగా మరలుతున్నారు. వీళ్ళలో వీళ్ళు అత్యంత లెఫ్ట్ తామే అని అక్కడి ప్రజానీకానికి చూపెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

బ్రిటన్ లోని లేబర్ పార్టీ అభ్యర్థి కోర్బిన్ కూడా భారత వైఖరిని తప్పుపట్టడానికి  కారణం అక్కడ గణనీయంగా స్థిరపడ్డ ముస్లింలు. అందుకోసమనే వారి ఓట్ల కోసం అక్కడి నేతలు ఆలా మాట్లాడుతున్నారు. 

ప్రపంచంలోని ముఖ్యనేతల్లో  ఇప్పుడు రైట్ వింగ్ పొలిటీషియన్స్ మనకు ఎక్కువగా కనపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి మొదలుకొని భారత ప్రధాని నరేంద్రమోడీ వరకు అంతా ఈ రైట్ వింగ్ రాజకీయ నాయకులే. ఒక రకంగా ఆల్ఫా మేల్ పర్సనాలిటీలతో రాజకీయాలను శాసిస్తున్న నాయకులే. 

మరి ఇక్కడే మనకు ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. ఏ దేశంలోనైనా భారతీయ సంతతికి చెందిన నేతలు అధిక సంఖ్యలో ఉంటారు. మరి వీరి ఓట్లు ఆ రాజకీయ నాయకులకు అవసరం లేదా అనే ప్రశ్న కలుగక మానదు. 

గత పర్యాయం భారతీయ అమెరికన్లలో దాదాపుగా 84శాతం మంది ప్రజలు ట్రంప్ కు వ్యతిరేకంగా హిల్లరీ క్లింటన్ కు ఓటు వేసినట్టు ఒక సర్వే తెలుపుతుంది. అయినప్పటికీ డెమొక్రాట్ అభ్యర్థి రేసులో ఉన్న బెర్నీ సాండర్స్ ఇలా ఎందుకు భారత వైఖరిని తప్పుబట్టాడు? మిగితా డెమొక్రాట్లు కూడా అడపా దడపా ఎందుకు ఇలా భారత పై అవాకులు చెవాక్కులు పేలుతుతున్నారు?

దీనిని అర్థం చేసుకోవాలంటే అమెరికాలోని భారతీయుల స్థితిగతులను అధ్యయనం చేయవలిసి ఉంటుంది. అక్కడ సెటిల్ అయిన భారతీయులు బాగా సంపాదించారు. అక్కడ ధనికుల్లో భారతీయ సంతతికి చెందిన వారి సంఖ్య అధికం. భారత సంతతి ప్రజలు విద్యావంతులు. 

సహజంగానే ఉండే వర్గ వ్యవస్థలో మనవాళ్ళను ఉన్నతవర్గానికి చెందినవారుగా పేర్కొనవచ్చు. వీరు తమని తాము మిగిలిన శరణార్థులతో పోల్చుకోవడానికి ఇష్టపడరు (బహుశా మన దేశంలోని కుల వ్యవస్థ కారణమేమో). వారు తమని తాము అక్కడి లోకల్ ప్రజల్లో ఒకరిగా భావిస్తారు. 

ఇప్పటివరకు అక్కడి భారత సంతతి  రాజకీయనాయకులనంతా కూడా డెమొక్రాట్లే. వారు డెమొక్రాట్ల ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెడతారు కూడా. కానీ ఈ వర్గ వ్యవస్థ వల్ల రిపబ్లికన్ల పిలుపుకు భారతీయులు స్పందించడం మొదలుపెట్టారు. 

కాబట్టి డెమొక్రాట్లకు అర్థమైన విషయం ఏమిటంటే, భారతీయుల ఓట్లు తమకు రావడం కష్టం. అందుకే వారికి వ్యతిరేక వైఖరిని అవలంబించి వేరే ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

.ఈ ఎన్నికల సంవత్సరంలో మోడీ అక్కడికి వెళ్లి ట్రంప్ తో సహా వేదిక పంచుకొని మాట్లాడితే అక్కడి భారత సంతతి ప్రజలకు ట్రంప్ పట్ల సానుకూల వైఖరి కలిగే ఆస్కారం ఉంది. ఇలా భారత సంతతి ప్రజల సపోర్టు గనుక ట్రంప్ కు తోడైతే, ట్రంప్ ఎన్నికల్లో తేలికగా గెలవచ్చు అని భావిస్తున్నాడు. 

ఇప్పటికే ఇజ్రాయెల్ ఎన్నికల్లో అక్కడి ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మోడీతో ఉన్న హోర్డింగులను ఏర్పాటు చేసి ఎన్నికల్లో పాల్గొంటున్నాడు. ఇప్పుడు ట్రంప్ కూడా ఇలాంటి పనినే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రేపు బ్రిటన్ లో కూడా ఇలానే మోడీ సుపోర్టును బోరిస్ జాన్సన్ కోరినా ఆశ్చర్య పోనక్కర్లేదు. 

సంబంధిత వార్త

అమెరికాలో మోదీ సభ... హాజరౌతానన్న ట్రంప్

Follow Us:
Download App:
  • android
  • ios