ఆఫ్ఘాన్లో నిజ స్వరూపం చూపిస్తోన్న తాలిబన్లు : అమల్లోకి షరియా చట్టం.. మళ్లీ బహిరంగ శిక్షలు
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇకపై నేరాల విచారణకు సంబంధించి షరియా చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆఫ్ఘన్ సుప్రీం లీడర్ అలైకడర్ అమిరుల్ ఆదేశించారు. దీంతో ఇకపై నేరస్తులకు బహిరంగంగా శిక్షలు అమలు చేయనున్నారు.
అధికారంలో వస్తే మంచి పాలన అందిస్తామని, స్త్రీలకు కూడా చదువుకునేందుకు ,ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పిన తాలిబన్ల మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. తాలిబన్లు అధికారం అందుకున్న రోజున లక్షలాది మంది ఆఫ్ఘాన్లు దేశం విడిచి ఎందుకు పారిపోయారో ... వారంతా ఎందుకు భయపడ్డారో ఇప్పుడు ఆ ఘటనలే దేశంలో జరుగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చేందుకు గాను తాము మారిపోయినట్లుగా నటించారు. కానీ పోను పోను మానవహక్కులను తుంగలో తొక్కడం ప్రారంభించారు.
స్త్రీలపై ఒక్కొక్కటిగా కఠిన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. తాజాగా నేరాల విచారణకు సంబంధించి షరియా చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని న్యాయమూర్తులను ఆఫ్ఘన్ సుప్రీం లీడర్ అలైకడర్ అమిరుల్ ఆదేశించారు. షరియా చట్ట పరిధిలోకి వచ్చే కేసుల్లో ఆ చట్టం ప్రకారమే శిక్షలు విధించాలని అమిరుల్ సూచించారు. దీని ప్రకారం నేరాలు చేయాలంటేనే భయపడేలాగా బహిరంగంగా ఉరితీతలు, కాళ్లు, చేతులు విరగ్గొట్టడం, కొరడా దెబ్బలు విధించడం వంటివి ఆఫ్ఘన్ రోడ్లపై కనిపించనున్నాయి.
ALso Read:ఆఫ్గనిస్తాన్లో ఆడపిల్లలకు కొత్త రూల్ : పార్కులు, జిమ్లలోకి మహిళలకు నో ఎంట్రీ.. తాలిబన్ల హుకుం
ఇకపోతే.. గత వారం తాలిబన్లు మరో కఠిన నిబంధన తీసుకొచ్చారు. పార్కులు, జిమ్లలోకి మహిళలు ప్రవేశించకుండా నిషేధం విధించారు. అలాగే అన్ని రకాల అమ్యూజ్మెంట్ పార్కుల్లోకి మహిళలు వెళ్లరాదని హుకుం జారీ చేశారు. ఇప్పటికే దేశ రాజధాని కాబూల్లో ఈ నిబంధన అమలవుతోంది. దీంతో విషయం తెలియకుండా పార్కుల్లోకి వెళ్లిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి పార్కుల్లో సేద తీరుదామని భావిస్తున్న ఆడవాళ్లకు తాజా నిబంధన నిరాశకు గురిచేస్తోంది.
అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరింత ప్రమాదకరంగా మారుతున్నారు. ఈ ఏడాది జూలైలో బగ్లాన్ ప్రావిన్స్లోని అందరాబ్ జిల్లాలో ఒక యువకుడిని కాల్చి చంపారు. అనంతరం అతడి మృతదేహాన్ని జిల్లాలోని మార్కెట్ దగ్గరకి తీసుకెళ్లి బహిరంగంగా ఉరితీశారు. ఈ పరిణామం యావత్ ప్రపంచాన్ని ఒక్క సారిగా ఉలిక్కిపడేలా చేసింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. కసా తరాష్ ప్రాంతంలోని అందరాబ్లో నివసించే వ్యక్తి ఇంటికి సమీపంలోకి జూలై 20వ తేదీన తాలిబన్లు వెళ్లారు. ఇంట్లో నుంచి బయటకు రావాలని బలవంతం చేశారు. అనంతరం అతడిని కాల్చి చంపారు. అయితే అతడి భవనం ముందు గుమిగూడిన ప్రజలను కూడా తాలిబన్లు ఏరియల్ ఫైరింగ్ ద్వారా చెదరగొట్టారని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఆ మృతదేహాన్ని ప్రదర్శించేందుకు బహిరంగ మార్కెట్ కు తీసుకొచ్చి, వేలాడదీసి దుశ్చర్యకు పాల్పడారు.