ప్రధానమంత్రి, రక్షణ మంత్రి ఫోన్లలో పెగాసెస్ స్పైవేర్.. ‘ప్రభుత్వ ఏజెన్సీల పని కాదు’
స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, రక్షణ మంత్రి మార్గరీటా రోబుల్స్ల మొబైల్ ఫోన్లపై స్పైవేర్ పెగాసెస్ దాడి జరిగిందని ప్రభుత్వమే ప్రకటించింది. మంత్రి ఫెలిక్స్ బలానోస్ సోమవారం ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వంపై కాటాలోనియా వేర్పాటువాదుల ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.
న్యూఢిల్లీ: మన దేశ రాజకీయాలను పెగాసెస్ స్పైవేర్ ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఈ స్పైవేర్ కారణంతో తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. మన దేశంలో రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు, విలేకరులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలపై కేంద్ర ప్రభుత్వం నిఘా వేసిందని ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రజాస్వామ్యంలో దీన్ని ఎంతమాత్రం ఆమోదించలేమని, వెంటనే దీనిపై విచారణ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ స్పైవేర్ను ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూపు రూపొందించింది. అయితే, తమ సాఫ్ట్వేర్ను కేవలం ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే విక్రయిస్తామని, ప్రైవేటు వారికి వీటిని అమ్మబోమని ఆ సంస్థ వెల్లడించింది. దీంతో ప్రభుత్వమే ఈ స్పైవేర్ను కొనుగోలు చేసి అసమ్మతిని అణగదొక్కుతున్నదని విపక్షాలు విమర్శలు చేశాయి. ఇదంతా ప్రభుత్వం ఒక వేళ దాని విమర్శకులపై నిఘా వేయాలనుకుంటే ఉండే తీరు. కానీ, ఏకంగా దేశ ప్రధానమంత్రి, దేశ రక్షణ మంత్రిపైనే పెగాసెస్ స్పైవేర్ నిఘా వేశారని తెలిస్తే ఎలా ఉంటుంది. షాకింగ్ కదా.. స్పెయిన్లో ఇదే జరిగింది.
స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్, స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరీటా రోబుల్స్ మొబైల్ ఫోన్లలో స్పైవేర్ పెగాసెస్ను గుర్తించినట్టు ప్రభుత్వ ప్రెసిడెన్సీ మినిస్టర్ ఫెలిక్స్ బలానోస్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. స్పెయిన్ ప్రధాని సాంచెజ్ ఫోన్లో మే 2021లో ఈ స్పైవేర్ను ఎక్కించారని, అప్పటి నుంచి కనీసం ఒక్కసారైనా డేటా లీక్ అయిందని వివరించారు. అయితే, దేశ ప్రధానిపై నిఘా వేసినవారు ఎవరు అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. విదేశీ శక్తులు ఈ పనికి పూనుకున్నాయా? లేక స్పానిష్ గ్రూపులకే ఈ పనికి తెగబడ్డాయా? అనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే, ఈ చర్య అక్రమం అని, ఎక్టర్నల్ అని వివరించారు. అంటే.. ప్రభుత్వ శక్తులు కాకుండా అధికారిక అనుమతి లేకుండానే జరిగిన దాడిగా ప్రధాని మొబైల్పై స్పైవేర్ అటాక్ను పేర్కొన్నారు.
వామపక్ష సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. కెనెడా డిజిటల్ రైట్స్ గ్రూప్ సిటిజెన్ ల్యాబ్ ఇటీవలే ఓ అధ్యయనం వెల్లడించింది. కాటాలోనియా వేర్పాటువాద ఉద్యమాని కి చెందిన సుమారు 60 మంది ఉద్యమకారులను పెగాసెస్ స్పైవేర్ ఆధారం చేసుకుని నిఘా వేశారని ఈ సిటిజెన్ ల్యాబ్ తెలిపింది. దీంతో ఈ ఆరోపణలపై విచారణ జరగాలనే ఒత్తిడి తీవ్రంగా వచ్చింది. దీంతో ప్రభుత్వంలోని వామపక్ష భావజాలం ఉన్న పార్టీ ఈఆర్సీ కీలక ప్రకటన చేసింది. స్పెయిన్ ప్రభుత్వం పౌరుల్లో సంశయాలు తొలగించి విశ్వాసాన్ని నింపే వరకూ అంటే.. తమ వైఖరిని స్పష్టం చేసే వరకు తాము ప్రభుత్వాని కి మద్దతు ఇవ్వమని ఈఆర్ సీ స్పష్టం చేసింది. ఈ తరుణంలోనే తాజా ప్రకటన వచ్చింది.
స్పెయిన్లోనూ వేర్పాటువాద ఉద్యమం జరుగుతున్నది. స్పెయిన్ నుంచి తమకు విముక్తి కావాలని, తాము స్వతంత్రంగా ఉంటామని కాటాలోనియా ప్రాంతవాసులు ఉద్యమం చేస్తున్నారు.