Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై దాడిని కొనసాగిస్తున్న రష్యా పై కఠిన ఆంక్షలు విధించాలని భారత్ సహా పలు దేశాలకు ఉక్రెయిన్ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే, ఆంక్షలంటే యుద్ధమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు నగరాలను, కీలక ప్రాంతాలను తన అధీనంలోకి తీసుకుని రష్యన్ బలగాలు ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే నాటోలోని దేశాలతో పాటు చాలా యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అమెరికా, జపాన్, బ్రిటన్ సహా చాలా దేశాలు మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఆర్థికంగా రష్యా సంక్షోభంలోకి జారుకునే అవకాశాలు అధికం అవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానమని అన్నారు. ఉక్రెయిన్పై దండయాత్ర నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలపై పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, ఈ క్రమంలోనే ఉక్రెయిన్ తో పాటు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న దేశాలపై విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్ పై జరుపుతున్న యుద్ధాన్ని పుతిన్ సమర్థించుకున్నారు. ముందుగా రష్యా శాంతియుతంగా వివాదాల పరిష్కారానికి ప్రయత్నించిందని తెలిపారు. అయితే ఉక్రెయిన్ దీనికి అడ్డంకులు సృష్టించిందని, శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. నాటో తో చేతులు కలుపుతూ ముందుకు సాగిందని అన్నారు. అందుకే తమ దేశానికి ముప్పుగా మారిన ఉక్రెయిన్ను సైనిక, అణ్వాయుధ రహితంగా చేస్తామన్నారు. ఈ లక్ష్యం నెరవేరే వరకు యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. పుతిన్ ఆదేశాలతో మరింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. సైన్య రహితంగా చేసేంత వరకు ఈ దాడి కొనసాగుతుందని పేర్కొంటోంది. ప్రస్తుతం యుద్ధ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లోని దాదాపు అన్ని సైనిక స్థావరాలను నాశనం చేసినట్టు వెల్లడించారు. ఆయుధ గిడ్డంగులు, మందుగుండు సామగ్రి డిపోలు, విమానయానం మరియు వైమానిక రక్షణ వ్యవస్థలతో సహా ఉక్రెయిన్ కు చెందిన ప్రధాన సైనిక మౌలిక సదుపాయాలను నాశనం చేసే సైనిక మిటిటరీ మిషన్ ను రష్యా ఆచరణాత్మకంగా పూర్తి చేసిందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. "రష్యన్ దళాలు తమకు కేటాయించిన అన్ని పనులను పూర్తి చేస్తాయి.. ఉక్రెయిన్లో ఆపరేషన్ ప్రణాళిక మరియు షెడ్యూల్కు అనుగుణంగా కొనసాగుతోంది" అని పుతిన్ వెల్లడించారు.
అయితే, ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు అధికం అవుతూనే ఉన్నాయి. దీంతో రష్యాకు అర్థిక ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యుక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి రష్యాపై ఆంక్షల అస్త్రాలను ప్రయోగిస్తూనే ఉన్నాయి నాటో దేశాలు. బ్యాంకింగ్ నుంచి ఇంధనం వరకు అన్ని రంగాలలో రష్యాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుందనీ, మరో సంక్షోభం తలెత్తే అవకాశముందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. ఇప్పటికే రష్యా కరెన్సీ విలువ పడిపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆ దేశంలోని కుబేరుల ఆస్తుల రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి.
