ఉక్రెయిన్‌పై మూడు రోజుల్లో 900 డ్రోన్లు, 69 క్షిపణులతో రష్యా దాడులు. శాంతి చర్చల మధ్యే మాస్కో తీరుపై జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ మరోసారి రష్యా దాడులకు బలైంది. ఒకవైపు ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు కొనసాగుతుండగా, మాస్కో మాత్రం ఉక్రెయిన్‌పై వర్షంలా క్షిపణులు, డ్రోన్లు కురిపిస్తోంది. గత మూడు రోజులుగా 900కు పైగా డ్రోన్లు,  69 క్షిపణులతో ఉక్రెయిన్‌ను లక్ష్యంగా చేసిందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.

ఈ దాడుల తీవ్రత పెరుగుతుండగా, పుతిన్‌కు యుద్ధం ఆపాలన్న ఆలోచనే లేదని జెలెన్‌స్కీ ఆరోపించారు. కీవ్‌తో పాటు ఇతర ప్రాంతాలపై విమానాల ద్వారా జరిపిన భారీ దాడుల్లో ఐదు కీలక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఖ్మెల్నిట్స్కీ ప్రాంతంలోని మిలిటరీ స్థావరంపై ఏకంగా ఏడు క్రూయిజ్ క్షిపణులు ప్రయోగించారని తెలుస్తోంది.

ఈ దాడుల్లో వాణిజ్య కేంద్రాలు, నివాస భవనాలూ భారీగా నష్టపోయాయి. ఆదివారం ఒక్కరోజే 298 డ్రోన్లు, 69 క్షిపణులతో రష్యా మళ్లీ దాడికి దిగింది. ఇందులో చాలా భాగం ఇరాన్ తయారు చేసిన షాహిద్ డ్రోన్లు కావడం గమనార్హం. ఈ దాడుల కారణంగా 12 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.

ఇవన్నీ జరుగుతుండగా, యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. శుక్రవారం రెండు దేశాలు కలిపి 390 మందిని, శనివారం 307 మందిని అప్పగించుకోగా, తాజాగా మరో 303 మంది సైనికులను పరస్పరం విడిచిపెట్టుకున్నట్టు రష్యా రక్షణశాఖ ప్రకటించింది.

ఇదిలా ఉండగా, అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ దాడులపై తీవ్రంగా స్పందించారు. పుతిన్ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆయన చేస్తున్న ఈ చర్యలు మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయని వ్యాఖ్యానించారు. అదే సమయంలో జెలెన్‌స్కీ మాటలు కూడా సమస్యను తీవ్రతరంగా మార్చుతున్నాయని తెలిపారు.

ఈ క్రమంలో జెలెన్‌స్కీ, అమెరికా-యూరోప్ దేశాలను ఉద్దేశించి, రష్యా తీరును నియంత్రించేందుకు మరింత కఠిన ఆంక్షలు విధించాలని కోరుతున్నారు.